పార్టీ నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు : ఇంచార్జ్లకు కొత్త టెన్షన్ ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికలపైన స్పష్టమైన దిశా నిర్దేశం చేసారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ముందుగానే పార్టీ నేతలు సమాయత్తం చేయటం ప్రారంభించారు. అందులో భాగంగా.. నియోజకవర్గాల ఇన్ఛార్జులకు కీలక సూచనలు చేసారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన చంద్రబాబు సర్వేలు చేయిస్తున్నారు. ఆ సర్వే నివేదికల ఆధారంగా నియోజకవర్గాల్లో అవసరమైన నిర్ణయాలకకు సిద్దం అయ్యారు. అదే విషయాన్ని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.
ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రానున్న ఏడాది కాలమే అత్యంత కీలకమని, అలసత్వం వీడి ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎవరు అలక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేసారు. శాసనసభ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జులతో చంద్రబాబు వరుస సమావేశాలు కొనసాగించనున్నారు. అవనిగడ్డ, పెనమలూరు, మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల ఇన్ఛార్జులు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కందుల నారాయణరెడ్డి, విజయకుమార్లతో చంద్రబాబు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అందులో క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలను వారి ముందుంచారు.
సర్వే నివేదికలతో..నియోజకవర్గా వారీగా
పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు... నేతల పని తీరు సైన స్పష్టమైన మార్గదర్శనం చేసారు. బలహీనంగా ఉన్న అంశాలు.. పని తీరు మెరుగుపర్చుకోవాల్సిన విషయాల పైన స్పష్టత ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదుతో పాటుగా.. నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా పరిశీలన పైన ప్రత్యేకంగా శ్రద్ద పెట్టాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రస్తుతం పార్టీకి ఉన్న బలాలు - బలహీనతల పైన నేతలకు చంద్రబాబు సూటిగా కొన్ని అంశాలను స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్దం అయ్యే క్రమంలో సమన్వయ లోపం ఉంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో పని తీరు నుంచి.. మార్పులు సూచిస్తూ.. అభ్యర్ధుల ఖరారు వరకు పూర్తిగా సర్వేల ఆధారంగానే చంద్రబాబు ముందుకెళ్తున్నారు.
అవే ప్రామాణికం - పోరాటం చేయండి
ఎక్కడా ఎటువంటి మొహమాటాలకు అవకాశం లేకుండా నిర్ణయాలు తీసుకుంటానని తేల్చి చెబుతున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపైనా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని వారికి చంద్రబాబు తెలిపారు. అదే విధంగా నియోజకవర్గల్లోనే స్థానిక సమస్యల పైన పోరాటాలు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. దీంతో...ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ అధినేత చేయిస్తున్న సర్వేలు.. పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లకు కొత్త టెన్షన్ కు కారణమవుతున్నాయి.ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపైనా స్థానికంగా కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లాలని వారికి చంద్రబాబు తెలిపారు.