ఏపీలో రాష్ట్రపతి పాలన- డీజీపీని రీకాల్ చేయాలి : ఎంపీని కొట్టారు-జగన్ పై పుస్తకం : ప్రెసిడెంట్ తో చంద్రబాబు టీం
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ టీం రాష్ట్రపతిని కోరింది. ప్రధానంగా నాలుగు డిమాండ్లను రాష్ట్రపతికి నివేదించారు. రాష్ట్రంలో పరిస్థితుల పైన వినతి పత్రంతో పాటుగా వైసీపీ పాలన పైన ప్రచురించిన పుస్తాన్ని టీడీపీ నేతలు రాష్ట్రపతికి అందించారు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోందని చంద్రబాబు ఆ లేఖలో ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 23 వేల ఎకరాల్లో గంజాయి సాగుతోందని..15 వేల కోట్ల విలువ ఉంటుందని చెప్పారు. జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా..ఏపీలో మూలాలు ఉంటున్నాయని ఆరోపించారు.
డ్రగ్స్ లో ఏపీ నెంబర్ 1 గా మార్చారు
ముంద్రా పోర్టులో హెరాయిన్ పట్టుబడితే విజయవాడలో అడ్రస్ ట్రేస్ చేసారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎక్కడా లేని లిక్కర్ బ్రాండ్స్ ఏపీలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. మద్యపాన నిషేధం పేరుతో నాలుగు రెట్లు ధరలు పెంచి..సొంత ఆదాయం పెంచుకుంటున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెరగటంతో గంజాయి వినియోగం పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో మాఫియా తయారైందని వ్యాఖ్యానించారు. దీని పైనే టీడీపీ పోరాటం చేసిందని వివరించారు. గతంలో అనేక విషయాల్లో ఏపీ నెంబర్ 1 గా ఉండేదని..ఇప్పుడు డ్రగ్స్ లో నెంబర్ 1 గా మారిందని వ్యాఖ్యానించారు.
టీడీపీ కార్యాలయం దాడుల పై సీబీఐ విచారణ చేయించాలి
పట్టాభి నివాసం.. టీడీపీ కార్యాలయం పైన దాడులు చేసారని చెప్పారు. ఒకే సమయంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయన్నారు. పార్టీ కార్యాలయం పైన పోలీసులే దాడులు చేయించి బయటకు పంపారంటూ ఆరోపించారు. ఒక పార్టీ కార్యాలయం పైన దాడి చేయటం దేశంలో ఎప్పుడూ లేదన్నారు. ముఖ్యమంత్రి..డీజీపీ కలిసి ఈ రకమైన దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఉన్మాద పాలన సాగుతోందని..ప్రజలను..రాజకీయ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థల పైన దాడులకు దిగుతున్నారని చెప్పారు.
అన్నింటిపైనా దాడి.. రఘురామను కొట్టారంటూ
ఎన్నికల కమిషనర్ ను ఇంటికి పంపే దాకా వేధించారని.. ఎమ్మెల్సీ ఛైర్మన్ పైన..హైకోర్టు పైన...ఏపీపీఎస్సీ ఛైర్మన్ పైనా దాడి చేసారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జడ్జిలపైన పోస్టింగ్స్ పెట్టారని విమర్శించారు. ప్రలోభాలు పెట్టటం..మాట వినకుంటే దాడికి దిగటం అలవాటుగా మార్చుకున్నారన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పరోక్షంగా రఘురామ రాజు అంశం పైన మాట్లాడారు. ఒక ఎంపీని రాత్రంతా పోలీసు స్టేషన్ లో ఉంచి కొట్టారని..ఆ తరువాత సుప్రీం కోర్టు సూచనలతో హైదరాబాద్ ఆర్మీ ఆస్పత్రికి పంపిస్తే అక్కడ వాస్తవమని తేలిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులు లేవని .. స్వేచ్ఛ లేదని విమర్శించారు.
డీజీపీని రీకాల్ చేయాలి..నాలుగు ప్రధాన డిమాండ్లతో
ఈ అంశాలన్నింటి పైనా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసామని చెప్పారు. రెండేళ్లలో చేసిన అరాచకాలతో పుస్తకాలు వేసామని.. వాటిని రాష్ట్రపతికి అందించారు. దేశ సమగ్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని.. రాష్ట్రపతి పాలన విధించాలని ప్రధాన డిమాండ్ కాగా, రెండో డిమాండ్ గా టీడీపీ కార్యాలయం పైన దాడి ఘటన పైన సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేసారు. మూడో డిమాండ్ గా గంజాయి..డ్రగ్స్ వ్యవహారం పైన విచారణ చేయించాలని - నియంత్రించాలని కోరారు.
నాలుగో డిమాండ్ గా డీజీపీని రీకాల్ చేయాలని చంద్రబాబు టీం రాష్ట్రపతి ని కోరారు. దోషులను శిక్షించే వరకూ పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేసారు. ప్రధాని..కేంద్ర హోం మంత్రి అప్పాయింట్ మెంట్ అడిగామని..సమాచారం కోసం వెయిట్ చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.