మోదీ ప్రధానిగా ఉండరు..ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసాం: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ఎన్నికల్లో మోదీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశం లేదని జోస్యం చెప్పారు. మోదీ వ్యతిరేకత గాలి ఉధృతం చేసామని..వారికి ప్రత్యామ్నాయాన్ని సిద్దం చేయగలిగామని చెప్పుకొచ్చారు. 23వ తేదీ తరువాత దేశానికి కొత్త ప్రధాని వస్తారని స్పష్టం చేసారు.
మోదీ వ్యతిరేక గాలి ఉధృతం చేశాం..
ఏపీకీ న్యాయం కోసమే తాము ధర్మపోరాటం చేసామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీకాకుళం లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్త రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేకశక్తులను కూడగట్టామన్న చంద్రబాబు ... భాజపాకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. మోదీ వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేశామని, ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 26ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారని, గత ఐదేళ్లలో తానేం చేశారో నరేంద్రమోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. అసహనంతోనే మోదీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.

కొత్త ప్రధాని ఖాయం..
ఈ నెల 23 తరువాత కొత్త ప్రధాని రావటం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని, కొత్త ప్రధాని రాబోతున్నారని స్పష్టం చేశారు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ వల్ల కొరవడిందని, ఈవిధమైన చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు రాజకీయాలు గతంలో లేవని సీఎం వ్యాఖ్యానించారు. మొదట్లో గుజరాత్ నమూనా అని మోదీ హోరెత్తించారని, ఇప్పుడా గుజరాత్ మోడల్ ప్రజల్లో ఘోర వైఫల్యంగా తేలిందని చంద్రబాబు విమర్శించారు. చేసింది చెప్పేందుకు ఏమీ లేదు కాబట్టే మోదీ చౌకబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ తనను వ్యక్తిగతంగా విమర్శిచేందుకే ఏపీలో పర్యటించారని..ఏపీకి ఇచ్చిన హామీల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదని దుయ్యబట్టారు. తనది యై టర్న్ అని ప్రధాని అంటున్నారని..తనదే రైట్ టర్న్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications