జనసేన- బీజేపీతో పొత్తుపై తేల్చేసిన చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తులపై తన లక్ష్యం తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ అంశం ప్రస్తావించారు. ఇప్పటంలో పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారనే కారణంగా రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లన్నీ పడగొట్టారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను అనుకుంటే జగన్ రోడ్డు మీద తిరిగేవారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో తనను నాడు జగన్ రోడ్డు మీద కాల్చివేయాలని, ఉరి తీయాలన్నారని గుర్తు చేసారు.
అందరినీ కలుపుకొని వస్తానంటూ
ఇటీవల పవన్ కల్యాణ్ విశాఖకు వెల్తే సెద్ద సీన్ చేసారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పవన్ ను విజయవాడలో కలిసి సంఘీభావం ప్రకటిస్తే అందరం కలిసి పోరాడుదాం, ప్రజాస్వామ్యం కోసం అని చెబితే తనను విమర్శించారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా తాను స్పందిస్తానని.. టీడీపీ ముందు నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు. అందరినీ కలుపుకొని వస్తామంటూ పరోక్షంగా ఎన్నికల్లో పొత్తుల పైన చంద్రబాబు తేల్చి చెప్పారు. దీనికి కొనసాగింపుగా ఓట్లు వేయటం మీ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం సీనియర్ నేతగా తన బాధ్యత అంటూ చంద్రబాబు స్పష్టం చేసారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లో కూటమిగానే పోటీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనే అంశం మరో సారి స్పష్టమైంది.

పొత్తులుంటాయని క్లియర్ గా సంకేతాలు
ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ తరువాత టీడీపీ - జనసేన మధ్య పొత్తు పైన కొత్త చర్చ మొదలైంది. కానీ, ఇప్పుడు చంద్రబాబు మరోసారి తామంతా కలిసే వస్తామని.. ఓట్ల విషయం మాత్రం ప్రజల ఇష్టమని చెప్పటం ద్వారా.. పొత్తు ఖాయమంటూ చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో పాటుగా.. అసెంబ్లీలో తాను చేసిన శపథం గురించి చంద్రబాబు ప్రస్తావించారు. వచ్చా. మళ్లీ క్షేత్ర స్థాయిలో గెలిచి గౌరవ సభలో అడుగు పెడతానని చెప్పారు. తాను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే.. ఎన్నికల్లో మనమంతా కష్టపడి గెలవాలంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్దంగా ఉందన్నారు.
అనుమానాలు - సందేహాలకు సమాధానాలతో
తాను అధికారంలోకి వస్తే ఇంతకన్నా మెరుగైన సంక్షేమం అందిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టీడీపీ గాలి వీస్తోందని చెప్పని చంద్రబాబు.. ఈ ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు. తన తండ్రి హత్య పైన న్యాయ పోరాటం చేస్తున్న వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలుద్దామంటూ చంద్రబాబు పిలుపినిచ్చారు. ఇదే సమయంలో తాను -ప్రధాని మోదీ ఒకే వయసు వాళ్లమని.. తాను శారీరంగా చాలా ఫిట్ గా ఉన్నానని చెప్పారు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పైన చంద్రబాబు మండిపడ్డారు. అసలు సీఎం కు పాలన చేతకాదంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications