ఇక జిల్లాల్లోనే చంద్రబాబు - 10 నెలల కార్యాచరణ : జోష్ కంటిన్యూ - టార్గెట్ సీఎం జగన్..!!
మహానాడు ద్వారా టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత చంద్రబాబు ఈ మహానాడు ద్వారా తిరిగి పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కొంత కాలంగా ప్రణాళికలు సిద్దం చేసారు. మహానాడుకు ముందే జిల్లాల్లో పర్యటనలు చేసారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోనే ఉండాలని ఆదేశించారు. ఇక, మహానాడు నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మహానాడు వ్యూహం సక్సెస్ కావటంతో..వచ్చే ఎన్నికల వరకు ఇదే జోష్ ను కొనసాగిస్తూ..జిల్లాల పర్యటనలతో నేతలు - ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక ప్రజల్లోనే టీడీపీ అధినేత
గతంలో.. మహానాడుకు ముందే జిల్లాలు - నియోజకవర్గాల వారీగా మినీ మహానాడు నిర్వహించే వారు. అయితే, ఈ సారి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది మహానాడు వరకు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలు కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం ప్రతీ జిల్లాలోనూ మినీ మహానాడు నిర్వహించి పార్టీ కార్యక్రమంతో పాటుగా.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
అందులో భాగంగా.. ప్రతీ పార్లమెంటరీ కేంద్రంలో మినీ మహానాడు నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. మహానాడు వేదికగానే మినీ మహానాడు నిర్వహణ గురించి చంద్రబాబు ప్రకటన చేసారు. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తిరిగి పార్టీ కేడర్ లో ఇప్పుడే జోష్ కనిపిస్తోంది. ఇది ఏ మాత్రం తగ్గకుండా వచ్చే ఎన్నికల వరకూ కొనసాగించేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ప్రతీ పార్లమెంటరీ నియోజకవర్గంలో
అందులో భాగంగానే..తానే ప్రతీ పార్లమెంటరీ కేంద్రంలో పర్యటించేందుకు సిద్దం అవుతున్నారు. ప్రతి నెలా రెండు పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పెట్టుకుని ఒక్కో జిల్లాలో మూడు రోజులు గడపాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. పది నెలల వ్యవధిలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పర్యటన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సైతం మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంది.
ఇక, జూలై 8న వైసీపీ ప్లీనరీ జరగనుంది. సీఎం జగన్ సైతం జిల్లాల పర్యటనకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో..చంద్రబాబు జిల్లాల్లోనే ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేత లోకేష్ సైతం పార్టీ ఆదేశిస్తే పాదయాత్ర లేదా బస్సు యాత్రకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు.
టార్గెట్ సీఎం జగన్ - మిషన్ 2024
ముందుగా చంద్రబాబు జిల్లాల పర్యటన..దీనికి కొనసాగింపుగా లోకేష్ ప్రజాయాత్ర నిర్వహిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోగా లోకేష్ సైతం అన్ని నియోజకవర్గాల్లోను చుట్టేసేలా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.
దీని ద్వారా అటు చంద్రబాబు - ఇటు లోకేష్ ఇద్దరూ జిల్లాల్లోనే ఉండటం ద్వారా.. వైసీపీ కార్యక్రమాలను కౌంటర్ చేయటంతో పాటుగా.. పార్టీ శ్రేణులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయాలని భావిస్తున్నారు. ముందుగా.. పార్టీ అధినేత చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల పర్యటనకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.