ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు - స్పష్టమైన సంకేతాలు ఇలా.. : చంద్రబాబు...!!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాల అమలు మొదలు పెట్టారు. మూడు జిల్లాల్లో పర్యటించిన ఆయన తొలుత తన వ్యూహంలో భాగంగా పొత్తుల పైన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల అంశం ప్రస్తావించకుండానే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎలంటి త్యాగానికి అయినా సిద్దమంటూ వ్యూహాత్మక ప్రకటనతో కొత్త చర్చకు కారణమయ్యారు. ఇక, తన పర్యటనల ద్వారా ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు బాదుడే బాదుడే కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు.. మూడు జిల్లాల్లో పర్యటించారు.
ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు
శ్రీకాకుళం.. విశాఖ.. తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగాలు సాగాయి. పర్యటనకు వచ్చిన స్పందన పైన చంద్రబాబు వరుస ట్వీట్లు చేసారు. అందులో.. రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. జిల్లాల పర్యటనకు వస్తున్న ప్రజా స్పందన అద్భుతమని ట్వీట్ చేసారు. మూడు రోజుల తప జిల్లాల పర్యటన ఎంతో అద్భుతంగా సాగిందని వివరించారు. 7 జిల్లాలలోని 21 నియోజకవర్గాల్లో లక్షల మందికి చేరువగా పర్యటన సాగిందన్నారు.
వైసీపీ పైన కసి..టీడీపీ పైన ఆసక్తి కనిపించాయి
ప్రజా సమస్యలు, ప్రభుత్వ బాదుడే బాదుడుపై ప్రజల అభిప్రాయాలు, అవేదన, ఆగ్రహం రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేకతను చాటాయని విశ్లేషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో ప్రజలు మార్పును కోరుకుంటున్న తీరు స్పష్టంగా కనిపించిందంటూ కీలక వ్యాఖ్య చేసారు. తెలుగు తమ్ముళ్లలో కసి, ప్రజల్లో టీడీపీపై ఆసక్తి రానున్న మార్పును సూచిస్తున్నాయని చెప్పుకొచ్చారు. వాడవాడలా వెల్లువలా కదిలి, అర్థరాత్రి సైతం ఎదురేగి స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
రాష్ట్రానికే ఒక సందేశంగా ఈ స్పందన
ఒక్క మాటలో చెప్పాలి అంటే... ఈ టూర్ కు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికే ఒక సందేశం ఇచ్చిందంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక, ఈ నెల 10వ తేదీ నుంచి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక, పొత్తుల పైన ఇదే పర్యటనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సైతం ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసారు.
పొత్తుల పైన క్లారిటీ ఇచ్చేస్తారా
ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అంశం పైన స్పందించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలు సైతం ముందస్తు ఎన్నికల గురించి పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలతో ఏపీలో ముందుగానే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.