ఇంత అనుభవం ఉన్న నేనే..ఇక జగన్ ఏం చేయగలరు: ఆ హామీలు అలవికానివే.. చంద్రబాబు తేల్చేసారు..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం జగన్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ ప్రభుత్వం పైన అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైందని చెప్పుకొచ్చారు. అనుభవం లేని నాయకుడి పాలన సాగుతోందని విమర్శించారు. ఎన్ని కల సమయంలో నోటీకేది వస్తే అది చెప్పేశారని..అవి తీర్చలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మళ్ళీ విజయం టీడీపీదే..ఇది తధ్యం అని ధీమా వ్యక్తం చేసారు. ఇక..బీజేపీ - వైసీపీ కలయిక గురించి సైతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కామెంట్లు చేసారు. తాను జాగ్రత్త పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు ఎన్నికల ఫలితాల మీద విశ్లేషణ చేసారు.
Recommended Video


ఇంత అనుభవం ఉన్న నేనే చేయలేక..
ఏపీలో నెల రోజుల పాలన మీద టీడీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త విశ్లేషణ చేసారు. జగన్ ఇచ్చిన హామీలు అలవికానివేనని తేల్చి చెప్పారు. వాటిని ఎవరూ తీర్చలేరని స్పష్టం చేసారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం..కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటం..సీపీఎస్ రద్దు వంటి అమలయ్యే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టారు. ఇంత అనుభవం ఉండీ తానెందుకు చేయలేకపోయానో ఆలోచించాలని పార్టీ నేతలకు సూచించారు.
ఎన్నికల ముందు నోటికేది వస్తే అది చెప్పేసారని..అవి తీర్చలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు విశ్లేషించారు. మళ్లీ విజయం టీడీపీదే అంటూ ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో పార్టీ నేతల గురించి అధినేత కొన్ని వ్యాఖ్యలు చేసారు. ప్రజలు వారే ఓట్లు వేస్తారని కొంత మంది నేతలు ఇంట్లో నిద్రపోయారని .. ఆ అతి విశ్వాసం పార్టీకి నష్టం చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అనుభవం లేని నాయకుడి పాలన..
రాష్ట్రంలో అనుభవం లేని నాయకుడి పాలన సాగుతోందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. నెల రోజుల పాలనకే రాష్ట్రం లో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని వివరించారు. వీటిని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలో కూడా తెలియకుండా పాలన చేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపైన అప్పుడే ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేకత మరింత పెరగటం ఖాయమని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడిన చంద్రబాబు సంక్షేమ పధకాలు ఇచ్చాం కదా ..ప్రజలే ఓట్లు వేస్తారని కొంత మంది నేతలు ఎన్నికల్లో పని చేయకుండా ఇంట్లో నిద్రపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్య మంత్రి తాను జాగ్రత్త పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కమ్మ ఓట్ల శాతం లేకపోయినా కుప్పం ప్రజలు తనను గెలించారని చెప్పిన మాజీ సీఎం... పార్టీపై కొందరు కుల పార్టీ ముద్ర వేసి అసత్య ప్రచారం చేశారని వివరించారు.

జగన్ హామీలు అమలు చేయలేరా..
చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చిందని..అవి తీర్చే సమస్యే లేదని కుండ బద్దలు కొట్టారు. అయితే, ఇవి పార్టీ శ్రేణుల్లో ధైర్యం కోసం చెప్పిన మాటలా..నిజంగా ఇవి సాధ్యం కాని హామీలా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. ఇప్పటికే ఆర్టీసి విలీనం .. సీపీఎస్ రద్దు గురించి ముఖ్యమంత్రి జగన్ అధ్యయన కమిటీలు వేసారు. హామీల అమల్లో భాగంగా తొలి అడుగుగా చెప్పారు. అయితే, ఏ మాత్రం అధ్యయనం చేయకుండానే జగన్ ఈ హామీలు ఇచ్చారా అనే ప్రశ్న మొదలైంది. అయితే, వీలు కాని హామీలు ఇచ్చి జగన్ తన విశ్వసనీయతను పోగొట్టుకోర ని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. చంద్రబాబు ప్రజల్లో ఆ విశ్వసనీయత పోగొట్టుకోవటం వలనే ఓడిపోయారని ..జగన్ అదే విశ్వసనీయత కారణంగా గెలిచారని..ప్రతీ హామీని ఖచ్చితంగా అమలు చేస్తారని వైసీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఇవే అంశాల పైన అసెంబ్లీలోనూ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications