తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన చంద్రబాబు ? నిబంధనలను ప్రస్తావించిన సీఈవో !
ఏపిలో ఎన్నికలు ముగిసినా ఇంకా కోడ్ అమల్లోనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయి..గెజిట్ విడుదల అయ్యే వరకూ కోడ్ అమల్లోనే ఉంటుంది. అయితే, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులుగా అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పందించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెబుతుందో వివరించారు. సమీక్షలు నిర్వహించరాదని పరోక్షంగా తేల్చి చెప్పారు.

జూన్ 8 దాకా నాకు సమయం ఉంది..
పోలింగ్ ముగిసిన తరువాత సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి కోడ్ గురించి ప్రస్తావించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు జూన్ 8 వరకు ముఖ్యమంత్రిగా సమయం ఉందని గుర్తు చేసారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా నెలకు పైగా సమయం ఉందని..అప్పటి వరకు ప్రజలు ఇబ్బంది పడాలా అని ప్రశ్నించారు. పాలసీ నిర్ణయాలు తీసుకోకుండా సాధారణ పాలన చేసుకోవచ్చని సీయం వివరించారు. అదే సమయంలో తాగు నీటి ఎద్దడి , పోలవరం గురించి ముక్యమంత్రి సమీక్షించారు. అధికారులు అందులో పాల్గొన్నారు. ఇక, వరుసగా రెండు రోజు ముఖ్యమంత్రి ఎన్నికల తరువాత తొలి సారిగా సచివాలయానికి వచ్చారు. తొలుత సీఆర్డిఏ మీద సమీక్షించారు. ఆ తరువాత లా అండ్ ఆర్డర్ మీద సమీక్ష ఏర్పాటు చేసినా..దానిని రద్దు చేసారు.

రివ్యూలు కోడ్ ఉల్లంఘనే..
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో కలిసి రివ్యూలు చేయటం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పరోక్షంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించే అధికారం ఉంటుందా అనే ప్రశ్నకు ద్వివేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం చెబుతుందనే అంశాన్ని వివరించారు. కోడ్ వివరాలను అందచేసారు. అందులో ముఖ్యమంత్రి అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించకూడదని.. విధాన పరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్నారు. పోలవరం, సీఆర్డిఏ సమీక్షలను నిర్వహించటం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని వివరించారు. తాగు నీటి ఎద్దడి పై సమీక్ష కు కోడ్ అడ్డంకి కాదని చెప్పుకొచ్చారు. అయితే, సీఈవో ముఖ్యమంత్రి సమీక్షల పైన నేరుగా స్పందించటానికి నిరాకరించారు.

హోం శాఖ సమీక్ష రద్దు...
ఎన్నికల సంఘం పైన ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు రెండు రోజులుగా నిర్వహిస్తున్న సమీక్షల పైన ఎన్నికల సంఘం ఏ రకంగా స్పందిస్తుందనే చర్చ మొదలైంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రులు..అధికారులతో సమీక్షలు..వీడియో కాన్ఫిరెన్స్లు నిర్వహించరాదని ఇసి స్పష్టం చేసింది. సీయం సచివాలయంలో సీఆర్డిఏ సమీక్ష చేస్తున్న సమయంలో ఇసి అభ్యంతరం విషయం తెలిసింది .దీంతో..ఆయన ఆ తరువాత నిర్వహించాల్సి లా అండ్ ఆర్డర్ సమీక్షను రద్దు చేసుకున్నారు. ఇక, వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అధికారిక సమీక్షలు నిర్వహించటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications