అమరావతిలో తాత్కాలిక రాజధాని, 3రోజులు అక్కడే: చంద్రబాబు, 20వేల ఉద్యోగుల తరలింపు
హైదరాబాద్: అమరావతికి సమీపంలో.. గుంటూరు, విజయవాడ నగరాల్లో తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాలన మరింత దగ్గర చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇప్పటికిప్పుడు పూర్తిగా సొంత రాష్ర్టానికి వెళ్లలేమని, అందుకే వారంలో మూడురోజులు ఏపీలోనే ఉందామని అధికార యంత్రాంగానికి ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు శాఖలు, విభాగాల తరలింపుపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఏర్పాట్ల కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి హేమా మునివెంకటప్ప, రహదారులు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ సీఆర్డీఏ, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ అందుబాటులోని తాత్కాలిక వసతి ప్రాంతాలను గుర్తించనుంది. వెంటనే అక్కడికి కార్యాలయాల్ని తరలించేందుకు అవకాశాల్ని పరిశీలించనుంది. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని మేధా టవర్స్, ఐజేఎం టౌన్షిప్, నదీతీరం వెంబడి ఉన్న అతిథి గృహాలు, వివిధ శాఖలకు సంబంధించిన కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న స్థలం...ఇలా ప్రతి ఒక్కటీ పరిశీలించాలని సూచించారు.
హోంశాఖ నుంచి వ్యవసాయం వరకుదాదాపు 25శాఖలను హైదరాబాద్ నుంచి తరలించాలని భావిస్తున్నారు. ఇందులో తొలుత కొన్ని, తర్వాత మరికొన్నింటిని ఇలా దఫాల వారీగా తరలించాలన్న ఆలోచనా ఉంది. ప్రజలతో దగ్గరి సంబంధం ఉన్న వ్యవసాయం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం అటవీ, పర్యావరణం, గృహనిర్మాణ శాఖ తదితరాలన్నింటినీ వీలైనంత త్వరగా తరలించాలని నిర్ణయించారు.
ఏయే శాఖల నుంచి ఎంతమంది ఉద్యోగులు వెళ్లాలి? ఆయా శాఖలు, విభాగాల కార్యాలయాలకు ఎన్ని చదరపు అడుగుల స్థలం కావాలి, అదేవిధంగా వారి కుటుంబాలకు నివాసం కల్పించేందుకు ఎన్ని చదరపు అడుగులు కావాలన్నది ప్రాథమికంగా అంచనా వేశారు.
ఆ అంచనా ప్రకారం.. మొత్తంగా 20,053మంది ఉద్యోగులు అక్కడికి తరలాల్సి ఉంటుంది. ఆయా శాఖలు, విభాగాల కార్యాలయాలకు మొత్తం 44.77లక్షలచదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాలు కావాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి నివాసాలకు 1.73కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కావాలి. మొత్తంగా 2.18కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం కానుంది. తాత్కాలిక రాజధానికి నెల రోజుల్లోగా నిర్ణయించిన శాఖలు, ఉద్యోగులు తరలిపోనున్నారు.












Click it and Unblock the Notifications