చంద్రబాబు వయసై పోయింది: టీడీపీ అధినేతపై వైసీపీ కొత్త అస్త్రం
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ.. అటు పాలన పరంగా, ఇటు పార్టీ పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పని చేస్తోంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది.

టార్గెట్ 175 మాత్రమే కాదు..
వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏమిటనేది ఇప్పటికే స్పష్టమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ స్థానాలన్నింటినీ స్వీప్ చేయాలనే టార్గెట్తో పని చేస్తోన్నారాయన. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో తరచూ సమావేశమౌతోన్నారు. పార్టీపరంగా వర్క్షాప్లను నిర్వహిస్తోన్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారు.

ప్రజాదర్బార్తో..
అటు పాలనపరంగా చూసుకున్నా గానీ.. వైఎస్ జగన్ ప్రజల్లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదివరకట్లా సంక్షేమ పథకాలను నగదు మొత్తాలను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి విడుదల చేయట్లేదు. ప్రజల మధ్య అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. జిల్లాల పర్యటనలకూ శ్రీకారం చుట్టబోతోన్నారు. సచివాలయాల సందర్శనలనూ చేపట్టడానికి సన్నాహాలు చేస్తోన్నారు.

టీడీపీ సై..
అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఏ మాత్రం తీసిపోవట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటోన్నారు. ఎలాంటి ఆపద వచ్చినా తాము ఉన్నామంటూ స్పందిస్తోన్నారు. అధికార యంత్రాంగం కంటే ముందుగా క్షేత్రస్థాయికి వెళ్తోన్నారు. మొన్నటికి మొన్న గోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులే ముందుగా సందర్శించారు. వరద బాధితులకు అండగా నిలిచారు.

విలీన గ్రామాల్లో..
విలీన గ్రామాల్లోనూ ప్రభుత్వ పెద్దల కంటే ముందే చంద్రబాబు పర్యటించారు. బాధితులకు ఆపన్నహస్తం అందించారు. తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆయా గ్రామల ప్రజలు డిమాండ్ చేస్తోన్న వేళ.. నేరుగా వారి వద్దకే వెళ్లారు చంద్రబాబు. ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందే ఉంటోన్నారాయన. మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం క్షేత్రస్థాయి పర్యటనకు పూనుకున్నారు. ప్రజల్లో మమేకం అవుతున్నారు.

కొత్త అస్త్రం..
ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ కొత్త ప్రచార అస్త్రాన్ని తెర మీదికి తీసుకొస్తోంది. చంద్రబాబు వయస్సును ప్రస్తావిస్తోంది. ఇదివరకే ఒకరిద్దరు మాజీమంత్రులు దీన్ని బహిరంగంగానే ప్రస్తావించారు కూడా. చంద్రబాబు వయస్సు మీద పడిందని, ఇక ఆయన రాజకీయాలకు దూరమౌతారనే ప్రచారాన్ని మొదలు పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి చంద్రబాబు వయస్సు 76 సంవత్సరాలు దాటేస్తాయని, ఇదివరకట్లా సమర్థవంతంగా ఆయన పరిపాలన సాగించ లేకపోవచ్చనీ చెబుతోన్నారు.

చంద్రబాబును చూసి ఓటు వేస్తే..
చంద్రబాబును చూసి ఓటు వేస్తే.. దాని ఫలితం మరోలా ఉంటుందనే ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ నాయకులు. మూడు దఫాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవాన్ని చూసి ఆయనకే మరోసారి ఓటు వేస్తే మాత్రం పొరపడ్డట్టేనని అంటున్నారు. టీడీపీ గెలిస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేస్తోన్నారు.

పొలిట్బ్యూరోలో సైతం..
టీడీపీ పొలిట్బ్యూరోలో సైతం ఈ విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. తన వయస్సు గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని, అది పార్టీకి మైనస్ అవుతుందని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. తన వయస్సు గురించి వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రస్తావిస్తే.. దానికి అనుగుణంగా ఎదురుదాడి చేయాలనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం తెరమీదికి రావడం వల్లే.. బాదుడే బాదుడు సందర్భంగా తాను శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications