ముద్రగడ కాపు గర్జనపై చంద్రబాబు: వైఎస్, జగన్ ఏం చేశారంటూ నిప్పులు
హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన తునిలో కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు గర్జన మహాసభపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులను అప్రమత్తం చేశారు. కాపుల కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఎందుకు ముద్రగడ పద్మనాభం సభపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారనేది ఆయన ఆరా తీశారు.
కాపు గర రాజకీయంగా వాడుకునేందుకు వైసీపీ గోతికాడి గుంట నక్కలా కాచుకుని కూర్చుందని, కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కాపుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను చెడగొట్టేలా ఆ పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాదులోని తన నివాసం నుంచి ఆయన శుక్రవారం పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ కాపులకు ఏం చేశారని, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ఏం చేశారని, అప్పుడు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వైఎస్ జగన్ ఏనాడైనా కాపుల గురించి మాట్లాడారా? అనిని చంద్రబాబు నిలదీశారు.
వైషమ్యాలు రెచ్చగొడుతూ కులాల మధ్య వైరం పెంచాలని చూస్తున్నాయని, కులాల పేరుతో సమాజాన్ని ముక్కలు చేయాలని వైసీపీ, కాంగ్రెస్ చూస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. పట్టిసీమపై వైసీపీ లేనిపోని దుష్ప్రచారం చేసిందని, ప్రజలు దీనిని తిరస్కరించడంతో ఆపార్టీకి భంగపాటు తప్పలేదని చెప్పారు.
రాయలసీమలో ప్రాంతీయ చిచ్చుపెట్టాలని చూశారని, దీన్ని సీమ ప్రజలు భగ్నం చేశారని, ఇప్పుడు కాపులను రెచ్చగొట్టి సమాజంలో ఘర్షణ వాతావరణం పెంచాలని ఆ పార్టీలు చూస్తున్నాయని అన్నారు. తన ఆస్తిత్వాన్ని కోల్పోతున్నామనే భయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మొదలైందని, ఇదే దీనంతటికీ కారణమని ఆయన అన్నారు.
కాపుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని, కాపులకు రిజర్వేషన్పై అధ్యయనానికి జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలో బీసీ కమిషనను పునర్ వ్యవస్థీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.