అమరావతి ఇమేజ్ని డ్యామేజీ చేస్తారా: చంద్రబాబు, తొక్కేయడం తెలుసు: జగన్
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంలో సాక్ష్యాధారాలు చూపకుండా ఎపి రాజధాని అమరావతి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాల్ మనీపై చర్చ సందర్భంగా జగన్ మాట్లాడుతున్నప్పుడు జోక్యం చేసుకుని చంద్రబాబు శుక్రవారం సాయంత్రం శాసనసభలో ఆ మాటలన్నారు.
విజయవాడలో ఒకే కేసు నమోదైందని, ఒక్క మహిళ మాత్రమే ఫిర్యాదు చేసిందని, ఒక్క ప్రదేశం గురించి చులకనగా మాట్లాడుతూ అమరావతి ప్రతిష్టను దెబ్బ తీయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. సాక్ష్యాలు చూపితే చర్యలు తీసుకుంటామని, జగన్ ఊహించినదాని కన్నా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. సాక్ష్యాలు చూపకుండా సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కాల్ మనీ వ్యవహారం కొత్తది కాదని, 2013లోనూ ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చిందని ఆయన చెప్పారు. కాల్ మనీ కేసులో ఏడుగురు నిందితులున్నారని, వారి పేర్లు చెబుతూ వారిలో ముగ్గురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారున్నారని తాను నిర్దిష్టంగా చెప్పానని ఆయన గుర్తు చేశారు. తమపై వచ్చిన ఆరోపణల మీద తమ పార్టీ శాసనసభ్యులు సవాల్ చేస్తే జగన్ వాటికి సమాధానం చెప్పడం లేదని ఆయన అన్నారు. అనుభవం లేకపోతే నేర్చుకోవాలని ఆయన అన్నారు.
పత్రికలు కూడా ఇష్టానుసారం రాయడానికి వీల్లేదని, టీవీ చానెళ్లు కూడా అలా చేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. వాటికి కూడా తాము నోటీసులు ఇస్తామని, కాల్ మనీ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని వారు కూడా ఇవ్వాల్సి ఉంటుందని, ఏదేదో రాసేసి డ్యామేజ్ చేస్తామంటే సరి కాదని ఆయన అన్నారు. జగన్ డొంక తిరుగుడుగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
ఫొటోలతో తాము సాక్ష్యాలు చూపిస్తే ఆ సాక్ష్యాలు చంద్రబాబుకు కనిపించడం లేదని జగన్ అన్నారు. తాము చూపించిన ఫొటోలు చంద్రబాబుకు సాక్ష్యాలు కాకుండా పోతున్నాయని ఆయన అన్నారు. కాల్ మనీ వ్యవ హారంపై తాము సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కోరుతున్నామని, అయితే చంద్రబాబు రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తామని అంటున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు తొక్కేయడం తెలుసునని, రిటైర్డ్ న్యాయమూర్తితో కాల్ మనీ వ్యవహారాన్ని తొక్కేయడానికే రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తానని అంటున్నారని ఆయన అన్నారు.