కెసిఆర్, బాబులను దారిలో పెడ్తా: దత్తాత్రేయ, వెంకయ్యకు 'ప్రత్యేక' సెగ
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మధ్య సంబంధాలపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్లు ఎడమొహం..పెడమొహంగా ఉంటున్నారని కేంద్రమంత్రి దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రులిద్దరూ కలసి పనిచేసేలా దారిలో పెట్టడమే తన ధ్యేయమని దత్తన్న అన్నారు. రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్ ఫండ్ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని కార్మిక చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

హైదరాబాదులో ఉన్న ఇఎస్ఐ ఆస్పత్రి కన్నా మెరుగైన ఆస్పత్రిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని మరో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. కార్మిక రాజ్య బీమా సంస్థ ఉప ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు శనివారం విజయవాడలో ప్రారంభించారు.
ఈఎస్ఐ ప్రభుత్వ ఆస్పత్రి కన్నా మెరుగ్గా ఉండాలని వెంకయ్య నాయుడు సూచించారు. దేశ అభివృద్ధిలో కార్మిక శాఖ కీలకమైందని అన్నారు. కాగా, విజయవాడ గేట్ వే హోటల్లో మహిళా పారిశ్రామికవేత్తల సదస్సుకు వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించడంలో వెంకయ్య నాయుడు విఫలమయ్యారని విమర్శిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో హోటల్ ఎదుట ధర్నా నిర్మించారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications