'అల్లరి మూకలు' అని రాసినా స్పందన లేదు: కోడెల, ఎన్టీఆర్ వల్లే: బాబు
విజయవాడ: గతంలో అసెంబ్లీలో 'పెద్దల గలాటా' అని వార్త రాస్తేనే చర్చనీయాంశమయ్యేదని, ఇప్పుడు సభలో అల్లరి మూకలు అని రాసినా స్పందించలేకపోతున్నారని సభాపతి కోడెల శివప్రసాద రావు సోమవారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గుంటూరు జిల్లాలో మాట్లాడారు.
1998లోనే సమైక్య ఏపీలో ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశామని, ఏపీ స్ఫూర్తితోనే పార్లమెంటు, ఇతర రాష్ట్రాలు ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశాయని చెప్పారు. ఏటా ఆస్తులు ప్రకటించాలంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ఇక ప్రజలు ఎలా పట్టించుకుంటారని చెప్పారు.
యుగానికి ఒక్కడు ఎన్టీఆర్: చంద్రబాబు
స్వర్గీయ ఎన్టీఆర్ వంటి వారు యుగానికి ఒక్కరు ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితంలో అసాధ్యం అనే దానికి చోటు లేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల విషయంలో ఎన్టీఆర్ ఎప్పుడు రాజీ పడలేదన్నారు. పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే టిడిపి పని చేస్తుందన్నారు.
అవార్డులు ఎప్పుడూ ఎన్టీఆర్ను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. తనకు అవార్డులు అవసరం లేదని, ప్రజలే తనకు పెద్ద అవార్డు అని ఎన్టీఆర్ చెప్పేవారన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న రావాల్సి ఉందన్నారు. కఠోర శ్రమతో ఎన్టీఆర్ ఉన్నతస్థాయికి చేరుకున్నారన్నారు.
ఎన్టీఆర్ రాజకీయం కోసం, అధికారం కోసం పార్టీ పెట్టలేదని, ప్రజల కోసం, తెలుగుజాతి కోసం పెట్టారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం, పేదరిక నిర్మూలన కోసం ఆయన పార్టీ పెట్టారన్నారు. తనను ఆదరించిన తెలుగువారికి ఏదో చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు.
ఎన్టీఆర్ తానువేసిన ప్రతి సినిమా ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పారు. రాజకీయాల్లో చరిత్ర సృష్టించడమే కాదు, ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఆయన వంటి వారు యుగానికి ఒక్కడు ఉంటారని చెప్పారు.
తెలుగువారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే: పురందేశ్వరి
తెలుగువారికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్న వంతెన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఈరోజు ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయంప్రజలే నా దేవుళ్లు అంటూ ఎన్టీఆర్ పేద ప్రజల కోసమే నిరంతరం పరితపించారన్నారు.