మళ్లీ చంద్రబాబు-పవన్ పొత్తు ? నోవోటెల్ లో కీలక భేటీ-భవిష్యత్ పోరుపై కీలక వ్యాఖ్యలు
ఏపీలో మరోసారి చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పొత్తు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ కంటే ముందు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులతో ఉమ్మడిగా పోరాడేందుకు ఒకే వేదికపైకి వస్తున్నట్లు ఇరువురు నేతలు ఇవాళ ప్రకటించారు. విశాఖ ఘటనల నేపథ్యంలో విజయవాడ నోవోటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ ను కలిసిన చంద్రబాబు తాజా పరిస్థితులపై చర్చించారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఇరువురు నేతలు కలిసి భవిష్యత్ ప్రణాళికలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
పవన్ కు చంద్రబాబు సంఘీభావం
హైదరాబాద్ నుంచి వస్తూ పవన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం ప్రవర్తించిన తీరుపై ఆవేదనతో ఆయన్ను కలిసి సంఘీభావం తెలపాలని భావించానని చంద్రబాబు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వస్తూ పవన్ ను కలిసేందుకు నోవోటెల్ హోటల్ కు వచ్చానన్నారు. ప్రజాస్వామ్యంలో, నాగరిక సమాజంలో విశాఖలో జరిగిన ఘటనలు చూస్తే బాధేస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామిక విధానంలో విశాఖలో పర్యటించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. కానీ పోటీగా వైసీపీ నాయకులు గర్జన పెట్టారన్నారు. 40 ఏళ్ల రాజకీయంలో నేను ఇలాంటి ఘటనలు చూడలేదు. ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పవన్ విశాఖ వెళితే దారుణంగా ప్రవరించారన్నారు. జనసేన కార్యకర్తలపై దాడి చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. నా విషయంలోనూ అలాగే చేస్తున్నారు. ప్రజాస్వామ్యమంటే ఇదేనా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.
పవన్ ను అడ్డుకోవడం దారుణమన్న చంద్రబాబు
వైజాగ్ లో ఓ పోలీసు అధికారి కావాలని పవన్ కారెక్కి అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణమని చంద్రబాబు తెలిపారు. ఉన్మాదపాలనకు ఇదే నిదర్శనమన్నారు. విశాఖ వెళ్లేందుకు పవన్ కు అర్హత లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ విశాఖలో ఉంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా అని ఆయన నిలదీశారు. తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ మూడేళ్లుగా ప్రజాస్వామ్యం లేదు. రాజకీయ నాయకులకే రక్షణ లేకపోతే ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందన్నారు. దాడులు చేసి కేసులు పెట్టి, తిరిగి నిందలేయడం అలవాటుగా మారిందన్నారు. వైసీపీ నేతలు విమర్శించే వారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. తిరిగి మాట్లాడితే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలకు ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. మీడియా, ప్రజలకు స్వేచ్చ లేకుండా పోతోంది. వీరి బాధలు, హింసలు తట్టుకోలేక జనం ఆత్మహత్యలు చేసుకునే పరిస్దితి వచ్చింది. అందుకే నా మనసు బాధపడి కలిసిసంఘీభావం తెలిపేందుకే ఇక్కడికి వచ్చానన్నారు.చాలా రాజకీయ పార్టీలను చూశానని, ఇంత నీచమైన, దారుణమైన పార్టీని ఎప్పుడూ చూడలేదన్నారు. తమ ఆఫీసుపై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంఉందా అని ప్రశ్నించారు.
ముందు పార్టీలు కాపాడుకుందాం..
ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందామని చంద్రబాబు తెలిపారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాడదామన్నారు. ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పే పరిస్దితుల్లో రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారని చంద్రబాబు ప్రశ్నించారు. మమ్మల్ని తిట్టి ఈ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ ఆనందం శాశ్వతం కాదని సీఎం గుర్తుంచుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం. అవసరమైతే పవన్ తో మళ్లీ కలుస్తామన్నారు. కొంతమంది పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారు. ఊరికి పోతే నిర్బంధాలా ఇవి కూడా మారాలన్నారు. తప్పుడు పనులు చేసే వారిని నియంత్రిస్తాం. సమైక్యంగా అందరూ పోరాడతామని, వైసీపీకి తొత్తులుగా ఉంటే మీటింగ్ లు పెట్టుకోనిస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు, విద్యార్దులు అందరూ ప్రశ్నించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అందరూ కలుద్దామని పవన్ ను కూడా కోరుతున్నాను. ఆ విషయం ఇప్పుడు చర్చించాను. పోటీపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న సందర్భంలో జనసైనికుపై అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు తనకు ఫోన్ చేసి మద్దతిచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణ నుంచి కూడా జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న వంటి వారు ఏపీలో సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు సంఘీభావం తెలిపారన్నారు. చంద్రబాబుకు పవన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలు ఉండాలన్నారు. రాజకీయ పార్టీల గొంతు నొక్కేస్తామంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఇది టీడీపీ, జనసేనే కాదు తమ మిత్రపక్షం బీజేపీకి కూడా ఇదే పరిస్దితి వచ్చిందన్నారు. చాలా బాధాకరంగా ఉందన్నారు.
భవిష్యత్తుపై చర్చించలేదన్న పవన్
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. తమకే ఇలాంటి పరిస్ధితి ఉంటే మిగిలిన వారి పరిస్దితి ఏంటన్నారు. ప్రజలకు, వ్యాపారవేత్తలకు భరోసా ఇవ్వాలన్నది చర్చిస్తామన్నారు. ఇది ఎన్నికల అంశం కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అంశమన్నారు. భవిష్యత్తు రాజకీయాలపై ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అంశంపైనే దృష్టిపెడతామన్నారు.