సీఎం జగన్ ఓట్ బ్యాంకుపై చంద్రబాబు - పవన్ గురి : అదే జరిగితే అధికారం పక్కా..!!
టీడీపీ - జనసేన మధ్య పొత్తు అధికారికం కాలేదు. కానీ, రెండు పార్టీలు కామన్ అజెండాతో ముందుకు వెళ్తున్నాయి. రెండు పార్టీల అంతిమ లక్ష్యం జగన్ ను ఓడించటం..అధికారంలోకి రావటం. ఇందు కోసం ముందుగా ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారంలోకి రావటానికి నమ్ముకున్న బలం పైన ఫోకస్ పెట్టారు. ముఖ్యమంత్రి తన ఓటు బ్యాంకుగా మలచుకున్న సంక్షేమ పథకాల లబ్ది దారులపైన ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ కొందరు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం టీడీపీ- జనసేనకు నష్టం చేసే అంశం.

వచ్చే ఎన్నికల్లో జగన్ బ్రాహ్మస్త్రం ఇదే
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో కోటి 30 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్లు ఒక అంచనా. కరోనా వచ్చినా..ఆర్దికంగా కష్టాలు ఎదురైనా చెప్పిన క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయటం తమ ప్రభుత్వం గొప్ప తనంగా ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పథకాల అమలు విషయంలో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించే అవకాశం దక్కలేదు. అవినీతి జరిగిందనే ఆరోపణలకు అస్కారం ఇవ్వలేదు. దీంతో..ఇప్పుడు ప్రతీ ఇంటికి అమలు చేసిన సంక్షేమం పైన కరపత్రాలతో ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తున్నారు. ఈ పథకాలను ఆపేసేందుకు ప్రభుత్వం పైన చంద్రబాబు- పవన్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సీఎం జగన్ మొదలు పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

చంద్రబాబు - పవన్ కల్యాణ్ కామన్ స్లోగన్
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 97 శాతం అమలు చేసామని సీఎం చెబుతున్నారు. రాష్ట్రంలోని 87 శాతం ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. దీంతో, ఈ సంక్షేమ పథకాలే సీఎం జగన్ కు బ్రహ్మాస్త్రంగా.. ఓట్లు కురిపించే బ్యాంకుగా మారింది. ఇప్పుడు దీనిని గుర్తించిన చంద్రబాబు - పవన్ కల్యాణ్ ఈ పథకాల పైన గురి పెట్టారు. పథకాలు పైన ఆరోపణలు..అవినీతి గురించి ప్రస్తావించే అవకాశం దక్కకపోవటంతో, నేరుగా సంక్షేమ పథకాల అమలు పైన హామీలు ఇస్తున్నారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్..తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే మెరుగైన సంక్షేమం అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. దీని ద్వారా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పరోక్షంగా మద్దతు ప్రకటించారు.

సంక్షేమం ఓట్ బ్యాంకు ఎవరికి దక్కితే వారికే..
ఇక, ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు అదే చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమం చేయనని ప్రచారం చేస్తున్నారని, ఇంతకన్నా మెరుగైన సంక్షేమం అందిస్తానంటూ ప్రకటించారు. అయితే, ఈ సంక్షేమం అమలు కోసమే తాము అప్పులు చేయాల్సి వచ్చిందని..అయినా, గత ప్రభుత్వం కంటే తక్కువే అప్పులు చేసామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఇంతకంటే మెరుగైన సంక్షేమం చేస్తామని ఇప్పుడు చంద్రబాబు - పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలకు సీఎం జగన్ ఏరకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇంతకంటే సంక్షేమం నినాదంతో ఇద్దరు నేతలు జగన్ టార్గెట్ గా మొదలు పెట్టిన ప్రచారం సక్సెస్ అవుతుందా..సీఎం జగన్ ఓట్ బ్యాంకు పైన ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications