ఎపి ఉద్యోగులకు శుభవార్త: కెసిఆర్ తరహాలోనే చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 43 శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు. తమ రాష్ట్ర ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆ మేరకు ఫిట్మెంట్ ప్రకటించడంతో చంద్రబాబు కూడా తమ రాష్ట్ర ఉద్యోగులకు అదే ప్రకటించాల్సిన ఒత్తిడిలో పడ్డారు. మంత్రి వర్గ ఉప సంఘంతో భేటీ తర్వాత ఉద్యోగులకు ఇచ్చే ఫిట్మెంట్పై చంద్రబాబు సోమవారం రాత్రి ప్రకటన చేశారు.
ఆర్థిక సమస్యలున్నా ఉద్యోగుల సంక్షేమం కోసం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించినట్లు చంద్రబాబు చెప్పారు. అది 2014 జూన్ 2వ తేదీ నుంచే అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. దానివల్ల ప్రభుత్వంపై 9 వేల 2 వందల 84 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆయన చెప్పారు.
ఇప్పుడు డబ్బులు లేవని, ఆదాయం పెంచాలని, అప్పులు కట్టాలని, సంక్షేమం చూడాలని, ఆ బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అప్పుడు తాను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోందని ఆయన అన్నారు. ఉద్యోగులు తమకు పూర్తిగా సంహకరించాలని ఆయన అన్నారు. 43 శాతం ఫిట్మెంట్పై ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఆర్ధిక సమస్యల్లో ఉందని, రాష్ర్టాభివృద్దికి ఉద్యోగులంతా కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఫిట్మెంట్పై ప్రకటన చేసిన వెంటనే ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విభజన వల్ల ఆదాయం కోల్పోయామని, అందువల్ల రాష్ట్రం రెవెన్యూ పెరిగే వరకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చంద్రబాబు చెప్పారు.
సచివాలయం వెలుపల బాణాసంచా కాల్చి ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని సీఎంకు ఉద్యోగులు హామీ ఇచ్చారు. తమకు ఫిట్మెంట్ పెంచడంతో రాష్ట్రంలోని పలుజిల్లాలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురంజిల్లాలోని పుట్టపర్తిలో జేఏసీ నాయకులు బాణాసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని నగరం విజయవాడలో ఎన్జీవో ఆఫీస్ ముందు ఉద్యోగులు మిఠాయిలు తినిపించుకున్నారు.