అభ్యర్థిని కాదు నన్ను చూడండి, పని చేయిస్తా: బాబు
గతంలో టిడిపి తరఫున గెలిచిన వారితో తాను పని చేయించానని, ఇక ముందు కూడా చేయిస్తానని, ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి గెలిస్తే సరిపోతుందని అనుకోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను పార్టీ అభ్యర్థులు గెలిపించాలన్నారు. తాము అధికారంలోకి వస్తే సెల్ఫోన్లు లేని మహిళలకు వాటిని ఇవ్వడంతోపాటు వారి భద్రతకు అందులో ఒక ప్రత్యేక నెంబర్ను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఏ సమయంలో ఆపద అనిపించినా మహిళలు తమ వద్ద ఉన్న ఫోన్ నుంచి ఆ నెంబర్కు ఫోన్ చేస్తే ఐదు నిమషాల్లో పోలీసులు అక్కడకు చేరుకొని అవసరమైన భద్రత ఇచ్చే సౌకర్యం కల్పిస్తారన్నారు.
వసూళ్ల పార్టీలు, జైలు పార్టీలకు ఓట్లు వేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పార్టీలకు ఓట్లు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్లే అన్నారు. తెరాస వసూళ్ల దెబ్బకు ఉన్న కంపెనీలే ఇక్కడి నుంచి పోయే పరిస్థితి ఉంటుందని, దీంతో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలే పోతాయన్నారు.
తెలంగాణలో వీళ్లు కొత్తగా పునర్నిర్మాణం ఏమీ చేయనక్కర లేదని, అన్ని రకాల మౌలిక వసతులు తాము అభివృద్ధి చేసి పెట్టామన్నారు. ఇప్పుడు జరగాల్సింది సామాజిక తెలంగాణ నిర్మాణమని, ఆ పని కూడా తాము చేస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి కేసులన్నీ ఒక ఏడాదిలో తేల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఈ కేసుల్లో ఉన్నవారంతా ఏడాది తర్వాత ఎక్కడ ఉంటారని ఆయన ప్రశ్నించారు.
వాళ్లది కేసుల బాధ అయితే తమది ప్రజల బాధని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిసి ముఖ్యమంత్రిని తెస్తామని తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానం సునామీని సృష్టిస్తోందని, ప్రతి చోటా ఇది చర్చనీయాంశంగా మారిందన్నారు. తెలంగాణలో పార్టీని బిసిలకు అప్పగిస్తున్నానన్నారు.