అర్ధరాత్రి పవన్ అరెస్ట్- కలకలం: పోలీసుల వాహనంలో తరలింపు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
మరోవంక- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించినప్పటికీ.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు.

దీనితో రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించారు. అక్కడ చుక్కెదురైంది. సరిహద్దుల్లో ఏపీ పోలీసులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలకు అడ్డుపడ్డారు.
అప్పటికే చెక్పోస్ట్ వద్ద భారీగా మోహరించారు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు. కాన్వాయ్ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు చర్యలకు అడ్డుగా నిలిచారు. దీనితో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను అడ్డుకుంటోన్న పవన్ అభిమానులపై లాఠీ ఛార్జీకి దిగారు.
కొద్దిదూరం వెళ్లిన తరువాత అనుమంచి పల్లె వద్ద కూడా పోలీసులు.. పవన్ కల్యాణ్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. దీనితో ఆయన కారులో నుంచి కిందికి దిగారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వారిపై ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఎందుకు వెళ్లనివ్వరు.. ? అంటూ ప్రశ్నించారు. ఒక్క కారణం చెప్పండి అంటూ నిలదీశారు.

ఎవరు, ఎంతగా అడ్డుపడినా..తనను మంగళగిరికి వెళ్లకుండా ఆపలేరని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. కారు ముందుకు కదిలే పరిస్థితి కనిపించకపోవడంతో కాలి నడకన మంగళగిరి వైపు బయలుదేరారు. అక్కడా పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో లాభం లేదనుకున్న పవన్ కల్యాణ్ నడి రోడ్డు మీద పడుకున్నారు. తనను మంగళగిరికి వెళ్లనిచ్చంత వరకూ కదిలేది లేదని భీష్మించారు.
పవన్ కల్యాణ్ సహకరించకపోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్నూ అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ తమ వాహనంలో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారనేది తెలియరావట్లేదు గానీ.. హైదరాబాద్కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ అరెస్ట్తో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవన్, నాదెండ్ల మనోహర్ను ఎక్కించిన వాహనం ముందుకు కదలకుండా చాలాసేపటి వరకు రోడ్డుకు అడ్డంగా నిలిచారు. కొందరు అక్కడే బైఠాయించారు. ఏపీ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసులు వారించినప్పటికీ.. వినిపించుకోలేదు. దీనితో వారిని చెదరగొట్టారు. దీనితో తోపులాట చోటు చేసుకుంది. జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఉండటం వల్ల అదనపు పోలీసులను సంఘటన స్థలానికి రప్పించారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న కార్యకర్తలను చెదరగొట్టిన అనంతరం ఆ వాహనం ముందుకు కదిలింది.












Click it and Unblock the Notifications