నిర్మలమ్మతో చంద్రబాబు భేటీ..! అమరావతిపై కీలక ప్రతిపాదన..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణం కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. స్వయంగా ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనుల్ని పునఃప్రారంభించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గతంలో హామీ ఇచ్చిన విధంగా వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అమరావతికి రూ.15వేల కోట్ల నిధులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ నిధుల్ని తిరిగి చెల్లించే అప్పుగా ఇస్తే ఆ భారం రాష్ట్రంపై పడటం ఖాయం.
ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి అందిస్తున్న సాయంపై ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో నిర్మలమ్మ ముందు కీలక ప్రతిపాదన పెట్టారు. అమరావతి పూర్తి కావాలంటే మొత్తం రూ.79,280 కోట్ల నిధులు అవసరమని, ప్రస్తుతం రూ.44,351 కోట్ల విలువైన పనులు ప్రారంభించామని సీఎం తెలిపారు.

అలాగే వీటికి సంబంధించి ఇప్పటికే రూ.26,000 కోట్ల నిధులు సమీకరించినట్టు కూడా నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు తెలిపారు. అమరావతి నిర్మాణానికి ఇంకా నిధుల అవసరం ఉందని ఆమెకు వెల్లడించారు. ఇలాంటి సమయంలో అమరావతికి రెండో విడతగా ఇచ్చే నిధులను గ్రాంటు రూపంలో ఇవ్వాలని నిర్మలమ్మను కోరారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించి సాస్కి పథకం కింద ఈ ఆర్ధిక సంవత్సరానికి ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని కూడా నిర్మలమ్మను సీఎం కోరారు. అలాగే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక సహాయం కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. 16వ ఆర్థిక సంఘానికి రెవెన్యూ లోటును భర్తీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వినతిని అంగీకరించాలని కూడా కోరారు. విభజన వల్ల రాష్ట్రం ఇప్పటికీ ఆర్ధిక వనరుల లోటును ఎదుర్కొంటోందని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications