ఆంబోతులకు భయం ఉండదు.. దున్నపోతులకు చలనం ఉండదంటూ సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్
''ప్రజా రాజధాని అమరావతిని కుట్రపూరితంగా, కులాల పేర్లు చెప్పి వేరే చోటికి తరలిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేశారు. ఇసుక, లిక్కర్, భూదందాలతో దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. సంక్షేమ పథకాలనూ సరిగా అమలు చేయడంలేదు. కరెంటు బిల్లు ఎక్కువొస్తే రేషన్ కార్డులు రద్దుచేస్తామంటున్నారు. అన్యాయంగా వృద్ధుల, వికలాంగుల పెన్షన్లు తొలగించారు. పెట్టుబడిదారుల్ని బెదిరించి వెనక్కి పంపుతున్నారు. ఇదేమని ప్రశ్నింస్తే తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. ఇంత దగాకోరు ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదు''అంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘ప్రజా చైతన్య యాత్ర’
‘ప్రజా చైతన్య యాత్ర' పేరుతో తలపెట్టిన బస్సు యాత్రను చంద్రబాబు బుధవారం ఆరంభించారు. ప్రకాశం జిల్లా పరుచూరి నియోజకవర్గం, మార్టూరులో ప్రారంభమైన ఈ యాత్ర 45 రోజులపాటు 13 జిల్లాల్లోని 100కుపైగా నియోజకవర్గాల గుండా సాగనుంది. తొలిరోజు భారీ సంఖ్యలో హాజరైన టీడీపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత వైసీపీ లాగే వ్యవహరించి ఉంటే జగన్ పాదయాత్ర చేసేవాడేనా? అని నిలదీశారు.

అవి నా రెండు కళ్లు..
రాష్ట్ర విభజన తర్వాత చానాళ్లకు చంద్రబాబు మళ్లీ ‘రెండు కళ్లు' పదాన్ని వాడారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు తనకు రెండు కళ్లలాంటివని, ఆ రెండిటిపైనా సీఎం జగన్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు. అమరావతిలో రైతులు, ఆడబిడ్డలపై పోలీసుల చేత కొట్టించడాన్ని, ఒకే సామాజికవర్గం వాళ్లున్నారంటూ ప్రచారం చేయడాన్ని బాబు ఖండించారు. టీడీపీ సామాజిక న్యాయం కోసం పాటుపడిన పార్టీఅని, వైసీపీని మాత్రం పిచ్చి తుగ్లక్ లాంటి జగన్ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video


ఆంబోతులు.. దున్నపోతులు..
ఎన్నికల సమయంలో ఒక మాయ ప్రజల్ని ఆవహించిందని, ఒక్క చాన్స్ అన్న జగన్ కు ఓటేసి ఇప్పుడు పర్యవసానాలు అనుభవిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పంటలకు మద్దతు ధర లేదు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేశారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నందుకు ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేసేదుంటే అసలు జగన్ ఉండేవాడేనా? ఇలాంటి ఆంబోతులకు భయం ఉండదు, దున్నపోతుల మాదిరిగా చలనం కూడా ఉండదు. కానీ వాళ్ల పొగరు దించే శక్తి ప్రజలకు ఉంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీని మట్టికరిపించాల్సిన బాధ్యత ప్రజలదే''అని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications