అసెంబ్లీని పట్టించుకోరా, ఆర్నెల్లుగా నా ప్రయత్నం:బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) విషయంలో అసెంబ్లీ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా సంప్రదాయాలను తుంగలో తొక్కారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నిప్పులు చెరిగారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని తాను మొదటి నుండి కోరుతున్నానని చెప్పారు. సంప్రదాయాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. అసెంబ్లీ అభిప్రాయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఎలా బిల్లుపై చర్చిస్తారని ప్రశ్నించారు.
ఇరు ప్రాంతాలతో చర్చించి సమస్యను చర్చించాలన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా విభజించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇరు ప్రాంతాల మధ్య విషబీజాలు నాటారన్నారు. రాష్ట్రంలో ప్రజలే విడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ తమ రాజకీయ కుమ్మక్కు కోసం ప్రజల మధ్య విషబీజాలు నాటుతోందన్నారు.
రాష్ట్ర విభజన అనేది కేవలం బార్డర్ విభజనే తప్ప మనుషుల మధ్య విభజన కాదన్నారు. ఇప్పుడు ఎపికి జరిగింది రేపు మరో రాష్ట్రానికి కూడా జరగవచ్చునన్నారు. పార్లమెంటులో మందబలంతో ఇష్టానుసారంగా చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాజ్యాంగం ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.
భౌగోళికంగా విభజన చేయాలి కాని మనుషుల మధ్య విభజన చేయవద్దన్నారు. సమస్య పరిష్కారం కోసం తాను జాతీయ పార్టీ నేతలను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిశానని తెలిపారు. ఎంతో ముఖ్యమైన బిల్లును సభలో పెట్టినప్పుడు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకుండరన్నారు. బిల్లు ప్రవేశ పెట్టడాన్ని తాను చూడలేదని సుష్మాస్వరాజ్ చెప్పారన్నారు.
ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెసు సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోందన్నారు. జగ్జీవన్ రామ్ సభా సంప్రదాయాలను కాపాడితే ఆయన కూతురు మీరా కుమార్ మాత్రం సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. బిల్లు విషయంలో అడుగడుగునా ఉల్లంఘన జరిగిందన్నారు.
మనకు వ్యక్తులు ముఖ్యం కాదని వ్యవస్థలు ప్రధానమన్నారు. రాష్ట్ర విభజన తెలుగు జాతికో లేదా ఆంధ్రప్రదేశ్ సమస్యనో కాదన్నారు. ఇది దేశ సమస్య అన్నారు. ఇది కేవలం ఎపికే పరిమితం కాదని రేపు మరో రాష్ట్రానికి జరగవచ్చునని అన్నారు. కాంగ్రెసు వైఖరి వల్ల దేశ సమగ్రతకు ముప్పు అన్నారు.
పార్లమెంటులో మందబలం ఉపయోగిస్తే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు, సొంత పార్టీ ఎంపీలు కూడా విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను పార్టీ నేతగా కాకుండా ఇప్పుడు బాధ్యత గల పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. సమన్యాయం కోసం అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నానని తెలిపారు. ఇందు కోసం తాను ఆరు నెలలుగా ఎంత ప్రయత్నించాలో అంత చేశానన్నారు.