ఏడాదైనా అమలు చేయరు: గవర్నర్పై గుర్రు, టీ సర్కార్పై ఫైర్
విజయవాడ: ఉమ్మడి గవర్నర్ నరసింహన్పైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి గుర్రుమన్నారు. దేశ చరిత్రలో అనేక కొత్త రాష్ర్టాలు ఏర్పడినప్పటికీ ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఎన్నడూ రాలేదని, అడ్డగోలుగా విభజన చేశారని, ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారని ఆయన అన్నారు.
విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, ఉమ్మడి రాజధాని విషయం నుంచి రెవెన్యూ లోటు వరకు అనేక అంశాలను ఈ నెల 20న ప్రధానితో సమావేశంలో చర్చిస్తామని, కేంద్రం ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో చూడాలని ఆయన అన్నారు. సోమవారం రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై మూడో వివరణ పత్రం విడుదల చేశారు.
రాష్ట్ర విభజన చట్టం పూర్తి ఏకపక్షంగా జరిగిందని, ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేశారని, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలతో ఇష్టమొచ్చినట్లు విభజన చేసిందని, ఇటలీ రిపబ్లిక్ డే రోజున రాష్ట్ర విభజన అపాయింట్మెంట్ డేగా ప్రకటించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ వైఖరి కారణంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాల్సిన తెలుగు రాష్ర్టాల నడుమ అనేక వివాదాలు తలెత్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు ఉంటే ఏడాదిలోపు కూర్చుని మాట్లాడుకోమన్నారు. మేము చొరవ చూపినా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదని, అందుకే కేంద్రాన్ని ఒక పెద్దన్నలా విశాల దృక్పథంతో సమస్యలను సరిదిద్దమని కోరుతున్నామని, పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఆదుకోవాలని ఆయన మరోసారి అన్నారు.
గత యూపీఏ ప్రభుత్వం ప్రజలను అవమానించిందని, పునాదుల నుంచి నిర్మించుకుంటే తప్ప నిలబడలేమని, విభజన సమయంలో ఢిల్లీలో కూర్చున్నారు తప్పితే ఏపీకి వచ్చి ఎవరూ జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదని, అసలు విభజన సమయంలో ఆంధ్రాను పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. శాస్త్రీయత లేకుండా విభజన చేశారని ఆయన అన్నారు. విభజనకు తోడు 2004-14 మధ్య కాలంలో కాంగ్రెస్ చేసిన అవినీతి, అసమర్థ పాలన రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టిందని మండిపడ్డారు.
సెక్షన్-5, 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో నివసించే ప్రజలకు ప్రత్యేక భద్రత కల్పించాల్సి ఉందని అన్నారు. ఏపీ ప్రజల ఆస్తులను కాపాడేందుకు గవర్నర్కు అన్ని అధికారాలు ఇచ్చారని, పదేళ్ల తర్వాత మాత్రమే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 15 నెలలు అవుతున్నా గవర్నర్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో ఏపీని కించపరిచేలా తెలంగాణ చర్యలు చేపడుతోందని అన్నారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో కట్టినవన్నీ తెలంగాణకే చెందుతాయని మొదలుపెట్టి ఇంటర్ బోర్డ్ అకౌంట్లను సీజ్ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అధికారులను అవమానిస్తున్నారని అన్నారు. కమలనాథన్ కమిటీపై కూడా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. విద్యుత్తు శాఖలో 1250 మంది ఉద్యోగులు కోర్టులో వేసినా నేటికీ దిక్కు లేకుండా పోయిందని అన్నారు.
371- డిపై స్పష్టత లేదని, కార్పొరేషన్ ఉద్యోగులు ఎలా ఉండాలో సెక్షన్- 10లో పేర్కొనలేదని, వీటి వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ మొదలుకుని హార్టీకల్చర్, బయో పెస్టిసైడ్ ల్యాబ్స్, వివిధ వర్సిటీలు తెలంగాణకు వెళ్లిపోయాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 969 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఏపీకి 309 మాత్రమే దక్కాయని చంద్రబాబు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పైన ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఏపీని విమర్శిస్తోందని ఆక్షేపణ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్పై చర్చించకపోవడం వల్ల ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications