ఆర్బీఐ అడ్డు పడుతోంది: మాఫీపై బాబు వ్యాఖ్య
కాకినాడ: రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీకి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అడ్డుపడుతోందని, ఇరు రాష్ట్రాల వల్ల కేంద్రం నానుస్తోందని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంగరలో శనివారం ఏర్పాటు చేసిన జన్మభూమి - మావూరు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఎట్టి పరిస్థితిలోనూ రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్తు సమస్యను పరిష్కరించామని చెప్పుకున్నారు. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వికలాంగులకు ఇచ్చే ఫించను రూ.500 నుంచి రూ.1500కు పెంచినట్లు ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన చీర, ధోవతి కార్యక్రమాన్ని మళ్లీ తీసుకుని వస్తామని, పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే వస్త్రాలలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. గ్రామంలోని వృద్ధులు, వికలాంగులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు
అంతకు ముందు ఆయన అంగరలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లలో పోలవరం పూర్తి
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు అనపర్తి జన్మభూమి - మా వూరు కార్యక్రమంలో అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ప్రజల నీటి కష్టాలు తీరుతాయని ఆయన అన్నారు. కరవు శాశ్వత నివారణకు నీరు - చెట్టు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications