ఇన్ సైడర్ ట్రేడింగ్ : చంద్రబాబు ఎట్టి పరిస్థితిలోనూ తప్పించుకోలేరు : మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
రాజధాని అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సిఆర్డిఏ చైర్మన్ గా ఉండి చంద్రబాబు, మంత్రి నారాయణ రాజధాని భూముల విషయంలో పెద్ద కుట్ర చేశారని పక్కా ప్లాన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీల భూములు కాజేశారని ఆరోపించారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే ఐదు వందల ఎకరాల భూములను చంద్రబాబు కొట్టేశారని ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబుకు సిఐడీ నోటీసుల వెనుక ఉంది ఎమ్మెల్యే ఆర్కే .. ఆ ఫిర్యాదు మేరకే నోటీసులు
తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలు చంద్రబాబు భయపెట్టి లాక్కున్నారు
గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు అని పేర్కొన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలను చంద్రబాబు భయపెట్టి లాక్కున్నారని ఆరోపించారు. ప్యాకేజీ కూడా ఇవ్వకుండా భూములు ఇవ్వాల్సిందేనని బలవంతంగా లాక్కున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. శివారు భూములు, అసైన్డ్ భూములు, లంక భూములు, ప్రభుత్వ ,దేవాదాయ శాఖకు చెందిన భూములను కూడా చంద్రబాబు తన మనుషులకు కట్టబెట్టారని పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్కే జీవోలను అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డాడు అన్నారు.
రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూములు కొట్టేశారు
పట్టా భూములను సైతం కారుచౌకగా కొట్టేశారని విమర్శించారు. రెవెన్యూ అధికారులను ఒత్తిడి చేసి రికార్డులను తారుమారు చేయించారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిని తప్పించి చంద్రబాబు సి ఆర్ డి ఎ చైర్మన్ అయ్యారని , కేవలం అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసమే చంద్రబాబు సీఆర్డీఏ చైర్మన్ గా ఉన్నారన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నారాయణ తప్పించుకోలేరని స్పష్టం చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నాడు టిడిపి హయాంలో జారీ చేసిన రాజధానికి సంబంధించిన జీవోల మీద చంద్రబాబు, నారాయణ సంతకాలు లేవని , కానీ నోటిఫై ఫైల్స్ మీద మాత్రం చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉన్నాయని తెలియజేశారు.
చంద్రబాబు బయటపడటం కష్టమే
ఇక ఈ వ్యవహారం నుండి చంద్రబాబు బయట పడడం కష్టమేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.ఇప్పటికే చంద్రబాబుకు సిఐడీ నోటీసులు జారీ చెయ్యటం వెనుక ఎమ్మెల్యే ఆర్కే చేసిన ఫిర్యాదు ఉందని చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారంలో సిఐడీ విచారణ తర్వాతే చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు . ఈ వ్యవహారాన్ని మొదటి నుండి సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కార్ ఈ వ్యవహారాన్ని వదిలేలా కనిపించటం లేదు . ఇక టీడీపీ నేతలు తాజా పరిణామాల నేపధ్యంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు.