టాప్ టెన్లో అమరావతి: బాబు, దేవుడ్ని మింగే యత్నమని రఘువీరా
విజయవాడ: ప్రపంచంలోని పది అగ్రశ్రేణి రాజధానుల్లో అమరావతి ఉండాలనేది తన ఆకాంక్ష అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చైనాలో ఆయన బుధవారం నాలుగో రోజు పర్యటించారు. ఆయన గియాన్లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.
జిఐసిసి సదస్సులో ఆయన పాల్గొన్నారు. అమరావతి నిర్మాణానికి జిఐసిసి సహకరిస్తుందని ఆయన చెప్పారు. భారత్, చైనాలు బలమైన శక్తులుగా ఎదుగుతున్నాయని ఆయన చెప్పారు.
కాగా, అమరావతి నిర్మాణంపై కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంలో దేవుడ్ని మింగే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అమరేశ్వర స్వామి ఆస్తులను దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సింగపూర్ స్థాయిలో అమరావతిని నిర్మించడానికి దేశీయ నిపుణులు లేరా అని ఆయన అడిగారు. అమరావతి నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలావుంటే, రాజధాని అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు మేకిన్ ఫారిన్గా మారుస్తున్నారని సిపిఎం నేత బివి రాఘవులు వ్యాఖ్యానించారు. రాజధాని మేకిన్ ఇండియాగా ఉండకూడదా అని ఆయన అడిగారు. విజయవాడలో బుధవారం రాజధాని నిర్మాణం - విదేశీ కంపెనీల పెత్తనం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
చైనా ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేస్తోందని చెబుతున్న చంద్రబాబు 30 ఏళ్ల క్రితం ఆ దేశ పరిస్థితి ఏమిటనేది తెలుసుకోవాలని ఆయన అన్నారు. అన్ని పనులను విదేశీ కంపెనీలకే అప్పగిస్తున్న చంద్రబాబు దేశీయ కంపెనీలు మురికివాడల నిర్మాణానికే పరిమితమని చెప్పడం దారుణమని అన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన ఘనత భారతీయ కంపెనీలకు ఉందని ఆయన చెప్పారు. ఎల్ అండ్ టీ, షూపూర్ జీ పల్లోంజీ సంస్థలు నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణం కుంగిపోవడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని రాఘవులు అడిగారు.