బలవంతంగా విరాళాలు తీసుకోట్లేదు: బాబు, టిడిపిలో విభేదాలు.. చిరంజీవికి వ్యతిరేకంగా భేటీ
విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తాము బలవంతంగా విరాళాలు సేకరిస్తున్నామన్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చెప్పారు. ఆయన చిత్తూరు జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్న సంకల్పంతో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వచ్ఛదంగా విరాళాలు ఇస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు కావాలనే కోర్టుకు వెళ్లారన్నారు.
'మై అమరావతి మై బ్రిక్' అన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలనే స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. విరాళాల సేకరణలో బలవంతం లేదన్నారు. కాగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి రూ.10 చొప్పున సేకరించాలన్న ప్రభుత్వం నిర్ణయానికి కోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే.

మంగళగిరి టిడిపిలో విభేదాలు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టిడిపిలో విభేదాలు ముదిరాయి. పార్టీ ఇంఛార్జ్ గంజి చిరంజీవికి వ్యతిరేకంగా మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన టిడిపి కార్యకర్తలు గురువారం సమావేశమయ్యారు. చిరంజీవి నామినేటెడ్ పదవులను అమ్ముకుంటున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ బాలాజీ ఆరోపించారు.












Click it and Unblock the Notifications