చంద్రబాబు క్లియర్: హరికృష్ణ, జూ. ఎన్టీఆర్లతో కటీఫ్
హైదరాబాద్: తన బావమరిది, మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. హరికృష్ణను, హీరో జూనియర్ ఎన్టీఆర్ను దూరం పెట్టడంలో చంద్రబాబు మనసు మార్చుకోలేదని అర్థమవుతోంది. తిరుపతి ప్రజా గర్జనకు హరికృష్ణను ఆహ్వానించకపోవడంతోనే చంద్రబాబు అంతరంగం బయటపడినట్లు భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లతో సయోధ్యకు ప్రయత్నాలు సాగించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. నారా లోకేష్ ప్రయత్నానికి చంద్రబాబు అనుమతి కూడా ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ను గానీ, హరికృష్ణను గానీ పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు.
సయోధ్యకు నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా, లేదా అనే విషయాన్ని పక్కన పెడితే వారిద్దరికీ పార్టీలో ప్రధాన పాత్ర ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని అంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. యువతను, విద్యార్థులను పార్టీ వైపు ఆకర్షించే పనికి శ్రీకారం చుట్టారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా నందమూరి హరికృష్ణ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. ఇందులో చంద్రబాబు కనుసన్నల్లో మెలిగే పార్టీ పార్లమెంటు సభ్యులు హరికృష్ణను తప్పుదారి పట్టించారనే విమర్శలు వినవచ్చాయి. తనను నమ్మించి వారు మోసం చేశారనే అభిప్రాయంతో హరికృష్ణ ఉన్నట్లు చెబుతున్నారు.
పిలిస్తే పార్టీకి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగానే ఉన్నానని జూనియర్ ఎన్టీఆర్ రెండు మూడు సార్లు చెప్పారు. అయినా చంద్రబాబు నుంచి ఏ విధమైన ప్రతిస్పందన రాలేదు. దాన్నిబట్టి కూడా జూనియర్ ఎన్టీఆర్ను దూరంగా ఉంచాలనే వ్యూహంతోనే చంద్రబాబు వ్యవహారాలు నడుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో నందమూరి హరికృష్ణ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.