వైసిపి ఉండదు, జగన్ చాలాసార్లు రెచ్చగొట్టారు: చిల్లర తీసుకోకుండా వెళ్లిన చంద్రబాబు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వైసిపిలో అందరూ రౌడీలు, జేబు దొంగలే అన్నారు. అది తాత్కాలిక పార్టీ అని ఎద్దేవా చేశారు.
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మతిస్థిమితం లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వైసిపిలో అందరూ రౌడీలు, జేబు దొంగలే అన్నారు. అది తాత్కాలిక పార్టీ అని ఎద్దేవా చేశారు.
వైసిపి ఎన్నో రోజులు ఉండదు
వైసిపి ఎన్నో రోజులు ఉండదని చంద్రబాబు తేల్చి చెప్పారు. జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని, అందుకే అలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం కోసం తమ ప్రభుత్వం ఎన్నో మంచి పనులు చేస్తున్నా, వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసిపి విమర్శలు చేస్తోందన్నారు.
చాలాసార్లు రెచ్చగొట్టారు
తనను ఊరి తీయాలని జగన్ మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్నారని, తన బట్టలు ఊడదీస్తానని చెప్పారని, అసలు తాను ఏం తప్పు చేశానని చంద్రబాబు ప్రశ్నించారు. అనుభవం ఉన్న తనను ఎన్నోసార్లు అటువంటి వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టారన్నారు.
హెచ్చరించినా తీరు మారలేదు
ఎన్నికల కమిషన్ హెచ్చరించినా జగన్ తీరు మారలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మానసిక పరిస్థితి అసలు బాగా లేదని చెప్పారు. ఆయనకు రాజకీయాల్లో కొనసాహే నైతిక అర్హత లేదన్నారు. కులమతాల పేరుతో వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
కిరణా కొట్టు వద్ద గ్లూకో ప్లస్ తాగిన చంద్రబాబు
కాగా, శ్రీకాకుళం జిల్లా తెట్టంగిలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గ్రామ కూడలిలోని ఓ కిరాణా దుకాణం వద్ద ఆగి కాసేపు సేదతీరారు. సాయి కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న దుకాణం వద్దకు వెళ్లిన చంద్రబాబు.. టాటా గ్లూకో ప్లస్ కూల్ డ్రింక్ను తాగారు. పది రూపాయల విలువైన డ్రింక్ తాగిన చంద్రబాబు రూ. 500 నోటును ఆమెకు ఇచ్చారు.
చిల్లర తీసుకోకుండా వెళ్లారు
ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరు తెన్నులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిల్లర కూడా తీసుకోకుండానే చంద్రబాబు వెళ్లిపోయారు. ఆపై కొంత దూరంలో ఉన్న దివ్యాంగురాలు నెల్లి ఆదెమ్మ నివాసానికి వెళ్లారు. ఆమెకు పింఛను అందుతోందా అని ప్రశ్నించారు. అందుతున్నట్లు ఆమె చెప్పారు. ఓ ఇల్లును తనకు మంజూరు చేయించాలని కోరగా, తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఆపై మరో ఇంటికి వెళ్లి, ఆపరేషన్ జరిగిన ఇంటిపెద్ద మంచాన పడటంతో, ఇల్లు గడిచే మార్గం లేదని తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు తక్షణం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.