హోదా వస్తుంది: బలిదానంపై బాబు, 'పవన్! సినిమాల హిట్కోసమొద్దు, చిరంజీవితో కాదు'
చిత్తూరు: ప్రత్యేక హోదా కోసం మునికోటి (41) ఆత్మబలిదానం చేసుకోవడంపై సీమాంధ్రలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కోటి మృతి చెందాడన్న విషయం తెలియడంతో టిడిపి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మృతిపై స్పందించారు.
మునికోటి మృతి పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
రేపు మునికోటి అంత్యక్రియలు
ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న కోటికి సోమవారం నాడు అంత్యక్రియలు తిరుపతిలో జరగనున్నాయి. ఈ అంత్యక్రియల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొననున్నారు.
చిరంజీవి పైన నమ్మకం లేదు.. పవన్ కళ్యాణ్ మీరు రండి..!
ప్రత్యేక హోదా కోసం నిప్పంటించుకున్న మునికోటి మరణంతో సీమాంధ్రుల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. తిరుపతి ప్రజలు రగిలిపోతున్నారు. నేతలంతా తమతమ సొల్లు మీటింగులు పెట్టుకుంటూ, ఊకదంపుడు ఉపన్యాసాలతోనే సరిపెడుతున్నారని తిరుపతికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు, జగన్, రఘువీరా రెడ్డి, వెంకయ్య నాయుడు, చిరంజీవి తదితర ముఖ్య నేతలంతా ఉపన్యాసాలు ఆపి, ప్రధాని మోడీ ఇంటి ముందు కూర్చోవాలని డిమాండ్ చేశాడు. వీరంతా ఏకమైతే ఏపీకి ప్రత్యేక హోదా రావడం కష్టమేమీ కాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే మునికోటి ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు.
చిరంజీవి సభకు వచ్చి తొడలు కొడతారని, పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చొని ట్వీట్ల ద్వారా ఉపదేశాలు ఇస్తుంటారని మరొకరు ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు. మీ సినిమాలు హిట్ అవుతాయా లేదా అని ఇంట్లో కూర్చోవద్దన్నారు.
చిరంజీవి పైన తమకు నమ్మకం లేదని, పవన్ కళ్యాణ్ మీరైనా ఉద్యమానికి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. మొన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు చిరంజీవి, ఇతర కాంగ్రెస్ నేతలు పది కిలో మీటర్ల దూరం నడిచి పరామర్శించారని, నిన్న కోటి ఆత్మహత్యాయత్నం చేస్తే కనీసం కిలోమీటర్ దూరం వచ్చి పరామర్శించలేదన్నారు. చిరంజీవి ఏదో చేస్తానని పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపేశారన్నారు.
మునికోటి ఆత్మకు శాంతి కలగాలంటే అందరు జెండాలు, అజెండాలు పక్కన పెట్టాలని, సమైక్య రాష్ట్రంలో ఓడిపోయామని, కనీసం ప్రత్యేక హోదా కోసం కలిసి పోరాడి సాధించుతామని విజ్ఞప్తి చేశారు. నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు.