చంద్రబాబు అరెస్ట్ తప్పకపోవచ్చు: క్లారిటీ ఇచ్చిన మంత్రి..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణను కొనసాగించడంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దీనితో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇక మళ్లీ పట్టాలెక్కబోతోంది.
తన ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడ్డారనేది చంద్రబాబుపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణలపై విచారణ జరిపించడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనిపై చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై స్టే మంజూరు చేసింది హైకోర్టు. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ ఉదయం తన ఆదేశాలను వెలువడించింది.

స్టేను ఎత్తేయడాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతిస్తోన్నారు. చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించడానికి తమ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్టయిందని చెబుతున్నారు. చంద్రబాబు అక్రమాలపై త్వరలోనే సిట్ విచారణ పునఃప్రారంభమౌతుందని పేర్కొన్నారు.
తాజా పరిణామాలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. స్టేలతో బతుకుతున్న చంద్రబాబుకు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఆయనను ఎవరూ కాపాడలేరని చెప్పారు. చంద్రబాబు అక్రమాలపై తమ ప్రభుత్వం నిగ్గు తేల్చుతూ ఉంటే ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.

ఈ స్టేను ఎత్తేయించడానికి తమ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన తీర్పును ఇచ్చిందని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు అవినితీపై ఇక పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని, సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని సూచించిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఇక పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
రాజధాని, రాజధాని భూముల విషయంలో చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, అవన్నీ దర్యాప్తు సందర్భంగా బయటికి వస్తాయని జోగి రమేష్ చెప్పారు. చంద్రబాబు అక్రమాలన్నీ కూడా అతి త్వరలోనే వెలికి తీస్తామని, ఆయన అవినీతి బండారం మొత్తాన్నీ బట్టబయలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబు అరెస్ట్ కాబోతోన్నారని, ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చని జోగి రమేష్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications