ఎపి సిఎం హోదాలో 32 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ..!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సిఎం హోదాలో తొలిసారిగా ఎపి రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం అడుగు పెట్టారు. మండలిలో చంద్రబాబు దాదాపు 32 ఏళ్ల తర్వాత అడుగు పెట్టారు. మంగళవారం చంద్రబాబు సభలోకి వచ్చినప్పుడు సభలోని సభ్యులు అందరు లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు.
చంద్రబాబు కూడా నవ్వుతూ తన సీటు ఎక్కడ అంటూ సహాయకులను అడిగారు. ప్రవేశ ద్వారంలోనే ఆయన సీటు ఉంది. అయన దాదాబు సభలోని సభ్యులందరి సీట్ల వద్దకు వెళ్లి పలకరించారు. అనంతరం తన సీటు వద్దకు వెళ్లారు.
1980-82 మధ్య కాలంలో చంద్రబాబు మంత్రిగా ఉన్నారు. అప్పటి శాసన మండలికి ఆయన మంత్రిగా వచ్చారు. 1985లో శాసన మండలి రద్దయింది. 2007 మార్చి వరకు మండలి ప్రారంభం కాలేదు. కాంగ్రెసు పార్టీ హయాంలో పునఃప్రారంభం అయింది.
దీంతో చంద్రబాబు నాయుడు 1995 నుండి 2004 వరకు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మండలిలో అడుగు పెట్టే అవకాశం రాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఆయన వచ్చారు.