జగన్ మాటకు బాధపడ్డా, రోజా కేసు పెడ్తారా!: బాబు, 'సాక్షి స్వాధీనంకు కేంద్రం ఓకే'
కడప: చంద్రబాబును చీపుళ్లతో కొట్టాలన్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లాలో స్పందించారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని చీపురు కట్టతో కొట్టమని కొంతమంది మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలు ఎంత బాధ కలిగిస్తాయో కడప ప్రజలు ఆలోచించాలన్నారు.
చంద్రబాబు బుధవారం నాడు కడపలో నిర్వహించిన మహా సంకల్ప సభలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన నేపథ్యంలో కష్టాలలో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని, టెక్నాలజీ ఉపయోగించి ఈ ప్రాంతంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చేస్తున్నానన్నారు.
తాను ఇంతగా చేస్తుంటే విపక్ష నేత తన పైన అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమో చెప్పాలన్నారు. అలా నా పైన మాట్లాడటం సరైనదేనా కడ ప్రజలు ఆలోచించాలన్నారు. అది ఎంత బాధాకరమో ఆలోచించాలన్నారు.
ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని చెప్పుతో కొడతామంటే, మీకు ఎంత ఆవేశం, ఎంత బాధేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండన్నారు. కడప జిల్లాకు మీ వల్లే వచ్చిందని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ జిల్లాను, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు.
బాగా దెబ్బతిన్న జిల్లాను మళ్లీ అభివృద్ధి చేయడానికి, చెడ్డపేరు పోగొట్టడానికి నేను పని చేస్తున్నానని చెప్పారు. కానీ వారు తన పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. నేరాలు చేసే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో, ఆ విధంగా మాట్లాడుతున్నాడన్నారు.
రాష్ట్రంలో ఇన్ని కష్టాలుంటే, నేనేదో ప్రధాని నరేంద్ర మోడీతో రాడిపడ్డానని, ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు భయపడుతున్నానని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం తనకు ఇష్టం లేదన్నట్లుగా ఆయన మాట్లాడటం విడ్డూరమన్నారు.
తాను ఇచ్చిన హామీలు నిలబెట్టలేదని జగన్ చెబుతున్నారని, కానీ అన్నింటిని నెరవేర్చుతున్నామన్నారు. వైయస్ రాజసేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ 2004, 2009లో ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరలేదన్నారు. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు.
ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలని, నేను ఫెయిల్ అయితే ఈయన (జగన్) సక్సెస్ అయినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక పవిత్రమైన భావనతో మనం మహా సంకల్పం చేస్తే నా పైనే పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారా, ఇది చవకబారు రాజకీయమన్నారు. కాగా, చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏం చేయలేదని వైసిపి నేతలు, ఎమ్మెల్యే రోజా తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సాక్షిని స్వాధీనం చేసుకుంటాం: యనమల
త్వరలోసాక్షి పత్రికను, సాక్షి టీవీని స్వాధీనం చేసుకుంటామని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అన్నారు. అవినీతిపరుల అక్రమాస్తుల స్వాధీనానికి రూపొందించిన చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. రేపో, మాపో చట్టం అమలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.