ప్రభుత్వంపై తిరగబడితేనే - శ్రీలంకను దాటేసింది : రఘురామపై హత్యాయత్నం - చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రభుత్వం పైన మండిపడ్డారు. వరద బాధితులకు తాము అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.
దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మిపురం గ్రామాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగింది. పోలవరం పూర్తయితే వరద వచ్చేది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలు బురదలో ఉన్నారు, సీఎం గాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. ప్రజలు తిరగబడితే మీరు పారిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు. శ్రీలంకలో నాయకుల్లా నువ్వు పారిపోవడం ఖాయం అంటూ ధ్వజమెత్తారు.

ప్రభుత్వం విఫలమైందంటూ
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తాను వస్తున్నానని తెలిసి సహాయం చేసినట్లు డ్రామా చేశారని దుయ్యబట్టారు. సీఎం ఇచ్చేది అబ్బసొత్తు కాదు, ప్రజాధనం అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తెలంగాణలో వరద బాధితులకు పది వేలు ఇస్తుంటే..ఇక్కడ రెండు వేలు ఇస్తారా అని నిలదీసారు. పిరికితనమే మిమ్మల్ని చంపేస్తుంది.. ధైర్యంగా ఉండండి అంటూ సూచించారు. బాధితులకు న్యాయం చేయించే బాధ్యత తనదని స్పష్టం చేసారు. విమర్శించినందుకు మహాసేన రాజేష్ను వేధించారని చెప్పుకొచ్చారు.

రఘురామ అంశాల ప్రస్తావన
ఎంపీ రఘురామపై హత్యాయత్నం చేశారంటే.. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అల్లూరి విగ్రహం పెడితే స్థానిక ఎంపీని ఈ సీఎం రానివ్వరా అని నిలదీసారు. టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వంపై తిరగబడితేనే సమస్యల పరిష్కారం అవుతుందంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదోడి కష్టాలు తెలియని వ్యక్తి పదవిలో అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వేధిస్తారా అంటూ చంద్రబాబు నిలదీసారు. పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే ఇంత ముంపు వుండేది కాదని తెలిపారు.

రాష్ట్రం ఇలాగే ఉంటే దివాళా తీస్తుంది
పోలవరం పూర్తయ్యి నదులు అనుసంధానం అయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు, యువత కూడా వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వరద ముందుకొస్తుంటే ప్రభుత్వం నిద్ర పోయిందని విమర్శించారు. అప్పుల్లో శ్రీలంకను దాటిపోయాయని..ఇదే కొనసాగితే రాష్ట్రం దివాళా తీస్తుందని హెచ్చరించారు. పేదవాడికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications