ఫిబ్రవరి 1న ఢిల్లీకి చంద్రబాబు..! కియా పరిశ్రమ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీయం..!!
అమరావతి : వచ్చే నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్ళనున్నారు. పలు జాతీయ పార్టీల నేతలతో సీయం భేటీ కానున్నట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిపే పోరాటాలపై ఆయా పార్టీల నేతలతో చంద్రబాబు సమాలోచనలు చేస్తారు. అమరావతితో పాటు దేశంలోని మిగిలిన ప్రధాన నగరాల్లో కోల్కతా తరహా సభల నిర్వహణపై వారితో చర్చిస్తారు. కేంద్రానికి వ్యతిరేకంగా సభలు నిర్వహించేందుకు ఇప్పటికే టీడీపీతో పాటు జేడీఎస్, ఆప్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ పార్టీలు ముందుకు వచ్చాయి. వీరందరితో పాటు బీజేపి వ్యతిరేక పార్టీ లన్నింటినీ కూడగట్టి పది రాష్ట్రాల్లో కోల్కతా తరహా సభలు పెట్టాలని ఆ పార్టీలు యోచిస్తున్నాయి. అలాగే ఈ పర్యటనలో ఈవీఎంల పనితీరుపై ఇటీవల వస్తున్న ఆరోపణలపై వివిధ పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ఈ విషయంపై ఈవీఎంలు వద్దని ఎన్డీఏతర పార్టీల నేతలు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయించారు. అవసరమైతే ఈవీఎంల అంశంపై రాష్ట్రపతిని సంప్రదించాలని కూడా ఆ పార్టీలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోడీ వల్లే కియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందని భారతీయ జనతా పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాళ్లరిగేలా తిరిగానని బాబు చెప్పుకొచ్చారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్ధానంలో ఉందని చంద్రబాబు వివరించారు. ఇంత కష్ట పడుతుంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీ కుమ్మక్కై రాష్ట్రానికి అప్రదిష్ట తెస్తున్నారని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. కరువు సీమలో కియా కార్లు పరుగెత్తడం, సీమలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కడం ఈ రెండూ శుభకార్యాలు ఒకే రోజు జరగడం, తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా ఉందన్నారు సీయం. కియా పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి 13500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అనుబంధ విద్యుత్ కార్ల పరిశ్రమతో మరో 3వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలిపారు. కియా ద్వారా 11 వేల మందికి, అనుబంధ పరిశ్రమల ద్వారా మరో 4వేల మందికి ఉపాధి లభించనుందని చంద్రబాబునాయుడు తెలిపారు. అవినీతి రహిత రాష్ట్రమనే ఏపీకి కియా వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications