రూ.500, రూ.1000 నోట్ల రద్దు: సంచలన నిర్ణయంపై ఫలించిన బాబు పోరాటం
అమరావతి: దేశంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ప్రకటించారు. ఈ నోట్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన పోరాటం ఫలించినట్లేనా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోవడానికి రూ.1000, రూ.500 నోట్లు కారణమని గత కొన్నేళ్లుగా చంద్రబాబు చెబుతున్నారు. వీటిని నిషేధించాలని పలుమార్లు ఆయన గత ప్రభుత్వాన్ని కోరారు. అయినా నాటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇప్పుడు ఇదే విషయాన్ని మోడీ ప్రభుత్వానికి కూడా చంద్రబాబు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై మోడీని కలిసి కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే బ్లాక్ మనీని రూపుమాపుతామని మోడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ సంచలన ప్రకటన చేశారు.
కాగా, బ్లాక్ మనీ నిరోధానికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు.
ఈ నెల 11 వరకు వైద్య సేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చన్నారు. డిసెంబరు 30లోపు డిపాజిట్ చేయనివారు.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేయవచ్చన్నారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.