ప్రతిపక్ష నేతను నేనే: స్పష్టం చేసిన చంద్రబాబు: సందేహాలకు తెర!
అమరావతి: త్వరలో సమావేశం కాబోతున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రను ఎవరు పోషిస్తారనే చర్చలకు తెర పడింది. మొన్నటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న అనంతరం.. శాసనసభలో ఆ పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి, రికార్డు స్థాయిలో మూడుదఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. ప్రతిపక్ష నేత పాత్రను పోషించడానికి ముందుకొస్తారా? లేదా? అనే విషయంపై పెద్ద చర్చే నడిచింది.
వాటన్నింటికీ తెర దించారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్ష నేతగా తానే ఉండబోతున్నట్లు ప్రకటించుకున్నారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా కొనసాగుతున్న చర్చకు ఆయన తెర దించారు.
బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారికంగా రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన పేరు పక్కన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అనే హోదాను ఆయన పొందుపరిచారు. దీనితో- చంద్రబాబే ప్రతిపక్ష నేత అనే విషయాన్ని స్పష్టం చేసినట్టయింది.
ఇప్పటిదాకా ముఖ్యమంత్రిగా తాను కార్యకలాపాలను కొనసాగించిన ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు ఈ లేఖలో కోరారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని ఉండవల్లి సమీపంలో చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ప్రజావేదికను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేతగా తాను ఇదివరకు ఉన్న ఇంట్లోనే నివసించాలని నిర్ణయించుకున్నందు.. ప్రజా వేదికను తమ పార్టీ అవసరాల కోసం కేటాయించాలని కోరారు.
వైఎస్ జగన్ సమక్షంలో ప్రతిపక్ష నేతగా కొనసాగడానికి చంద్రబాబు మొదట్లో ఏ మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. రాజకీయాల్లో పదేళ్ల అనుభవం కూడా లేని వైఎస్ జగన్ ముందు తాను ప్రతిపక్ష నేతగా ఉండటం ఇష్టం లేదంటూ ఆయన పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో- శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు పేర్లు వినిపించాయి.
అదే సమయంలో- కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును బుజ్జగించారని వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నేత పాత్రను సమర్థవంతంగా పోషించగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకే ఉన్నాయంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆయనను బుజ్జగించారు. దీనితో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఉండటానికి అంగీకరించారు.