ఆర్టీసి సమ్మె: ఎండీపై చంద్రబాబు అసహనం, హైకోర్టులో పిల్
హైదరాబాద్: ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివ రావు తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకోవడంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి సిద్ధారాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఈ సమావేశానికి హాజరయ్యారు.
43 శాతం ఫిట్మెంట్ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం చంద్రబాబు రంగంలోకి దిగారు. కార్మిక నేతలతో మేనేజింగ్ డైరెక్టర్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మంత్రి శిద్ధా రాఘవరావుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కార్మిక సంఘాల నేతలతో చర్చల సందర్భంగా సంయమనం పాటించాలని, లేదంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు ఎండితో అన్నట్లు సమాచారం.
ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీతో చర్చించాలని సూచించారు. కేబినెట్ సబ్ కమిటీ సూచనల ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
ఇదిలావుంటే, ఆర్టీసి సమ్మెపై రెండు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేత సిఎల్ వెంకట్రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సమ్మెను విరమించేలా చూడాలని ఆయన హైకోర్టును కోరారు. ఆర్టీసి సమ్మెపై కమిటీ వేయాలని కోరుతూ మొహమ్మద్ గౌస్ అనే చిత్తూరు జిల్లావాసి పిల్ దాఖలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను, ఆర్టీసి యూనియన్లను, యాజమాన్యాన్ని పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.