మోడీ, బాబు మిత్రులు హామీ ఇచ్చారు, సమాధానం చెప్పే దమ్ముందా?: జగన్ ట్వీట్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మీరు చేసిన ద్రోహంపై సమాధానం చెప్పే నైతిక ధైర్యం మీకు ఉందా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.
కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు: నిమ్మకూరులో జగన్ ప్రకటన, కొనకళ్లపై బసవతాకరకం బంధువుల ఫిర్యాదు
సోమవారం రాత్రి ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. '2014 ఏప్రిల్ 30న నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, వారి మిత్రులు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల ముందు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్లలో హోదా డిమాండ్ను పాతాళంలోకి తొక్కేసేందుకు అవసరమైనవన్నీ చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెరతీశారు' అని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంచన వ్యతిరేక దీక్ష విజయవంతమైందని జగన్ మరో ట్వీట్ చేశారు. ప్రజల నుంచి ఈ దీక్షకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు ధర్మ పోరాటం పేరుతో తిరుపతిలో దీక్ష చేస్తున్నారని, కానీ నీ వంచనకు సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు.
టీడీపీ అంటే తెలుగు కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఏపీలో ఏర్పాటైన తెలుగుదేశం ప్రస్తుతం తెలుగు కాంగ్రెస్ పార్టీలా తయారయిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మండిపడ్డారు. రాష్ట్రంలో విలాసవంతమైన పోరాటం, దీక్షల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
టీడీపీ, కాంగ్రెస్లు తెలుగు రాష్ట్రాల్లో పరస్పరం సహకరించుకోవాలన్న యోచనతో ఉన్నాయన్నారు. తిరుపతిలో సీఎం చంద్రబాబు చేసేది ధర్మపోరాటం కాదని, అధికారం కోసం ఆరాటమన్నారు. చంద్రబాబు చేస్తున్న దీక్షలకు డబ్బు ఎక్కడిదని, అది పట్టిసీమలో సంపాదించిందేనా అని ఎద్దేవా చేశారు.