చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేవు: వైసిపి ఎమ్మెల్సీ బోస్
తూర్పుగోదావరి:పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేవని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుబాష్చంద్రబోస్ అభిప్రాయపడ్డారు.
శనివారం రాయవరం మండలం వెదురుపాకలో మాజీ ఎమ్మెల్సీ కె.జార్జివిక్టర్కు నివాళి అర్పించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం తిరస్కరణకు గురి అవుతోందని అందుకే చంద్రబాబు సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడంలేదని బోస్ విశ్లేషించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులు, మహిళలు, విద్యార్థులు, యవకులు...ఇలా అన్నివర్గాల ప్రజలను మోసగించిందన్నారు.
శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్ర పటానికి పాలభిషేకాన్ని చేయడాన్ని బోస్ తప్పుబట్టారు. సభాపతి స్థానంలోఉన్న వ్యక్తి ఏ రాజకీయ పక్షాలకు అనుకూలంగా వ్యవహరించరాదని, స్పీకర్ కోడెల ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం రాజ్యాంగ విలువలకు విఘాతం కలిగించడమేనని బోస్ వ్యాఖ్యానించారు.
భారత రాజకీయాల్లో కులం, మతం కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయని...కులం,మతం, ప్రాంతీయం తదిదర ప్రభావాలు తాటాకుమంటల్లా తాత్కాలికమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏవిధంగా ఉంటుంది అని విషయమై బోస్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మైలవరం నియోజకవర్గంలో వైసిపి నేత వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం మూలపాడులో నియోజకవర్గానికి చెందిన పేద మహిళలకు వసంత కృష్ణ ప్రసాద్ మొత్తం లక్ష చీరలను పంపిణీ చేశారు.
మరోవైపు వైఎస్ఆర్ పాలనపై పై మంత్రి దేవినేని ఉమ విమర్శల వర్షం కురిపించారు. రాజన్న రాజ్యంలో ఎంపీలు, అధికారులు జైలుకెళ్ళారని మంత్రి ఉమ ఎద్దేవాచేశారు. టిడిపి ధర్మపోరాటానికి ప్రజలు వస్తుంటే వైసీపీ తట్టుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు. పులిచింతలలో 45 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కృష్ణానది తీరప్రాంత, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉమ సూచించారు. గోదావరి- పెన్నా అనుసంధానం మొదటి దశకు త్వరలోనే సీఎం శంకుస్ధాపన చేస్తారని, ప్రతిపక్షనేతకు తిట్టే తీరిక తప్ప పోలవరం డ్యాం చూసే తీరిక లేదని మంత్రి దేవినేని ఉమ విమర్శించారు.