శత్రుత్వం ఉండకూడదనే...: కెసిఆర్కు ఆహ్వానంపై చంద్రబాబు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య శత్రుత్వం ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అమరావతి శంకుస్థాపన పత్రాన్ని అందించడంపై ఆయన సోమవారంనాడు మంత్రులకు వివరణ ఇచ్చారు. రాష్ట్రాలు వేరైనా రెండు ప్రాంతాల్లో ఉన్నది తెలుగువారేనని ఆయన అన్నారు.
రాష్ట్రాలు వేరైనా తెలుగువాళ్లమంతా ఒక్కటేనని, ఆ భావన మనమే కల్పించాలని, అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును అమరావతి శంకుస్థానకు ఆహ్వానించానని చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి శంకుస్థాపన కమిటీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సమావేశం అయ్యారు.
ఉమ్మడి రాష్ర్టానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నానని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ప్రజలందరూ అభివృద్ధి కావాలన్నదే తన ఆకాంక్ష అని... అన్ని రాష్ర్టాల సీఎంలను పిలుస్తున్నామని చెప్పారు. రెండు రాష్ర్టాల్లో ఉన్న తెలుగు ప్రజలంతా ఒక్కటే అన్న భావన మనం కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ను పిలవటం మీద ఎవరైనా రాజకీయ పక్షాల నుంచి కానీ, వేరే ఎవరినుంచైనా కానీ విమర్శలు వస్తే తిప్పి కొట్టాలని ఆయన మంత్రులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించారు. రాజధాని ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు జరగొద్దని, కార్యక్రమం మొత్తం సజావుగా జరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు.
కాగా, ఆయన ఇంద్రకీలాద్రికి సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ప్రజలు రెండు పండుగలను ఒకే రోజు చేసుకుంటున్నారని, ఒకటి దసరా కాగా మరోటి రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపన అని ఆయన అన్నారు.

అమ్మవారి వద్ద అమరావతి ఆహ్వాన పత్రం పెట్టినట్లు ఆయన తెలిపారు. ఏ విధమైన ఆటంకాలు లేకుండా అమరావతి నిర్మాణం జరగాలని తాను అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అన్ని విధాలా ఆశీర్వదించాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. అమరావతి తెలుగు ప్రజల్లో వెలుగులు తేవాలని కూడా కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ఏడాది ఇంద్ర కీలాద్రి అమ్మవారిని ఇప్పటికే లక్షా యాభై వేల మంది దర్శించుకున్నారని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. నవరాత్రి ఉత్సవాలను వచ్చే ఏడాది నుంచి భారీ యెత్తున నిర్వహిస్తామని చెప్పారు. మైసూరు దసరా ఉత్సావాల్లో పాల్గొనే భక్తుల కన్నా ఎక్కువ మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications