జగన్ ఎఫెక్ట్, కేసీఆర్ బాటలోనే చంద్రబాబు - కలిసొచ్చేనా..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ అధికారం నిలబెట్టుకొనేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ గా మారుతున్నాయి. పొత్తుల తో జగన్ ను ఓడించాలనేది ప్రయత్నం. ఈ సమయంలోనే చంద్రబాబు పోటీ చేసే కుప్పంపై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇటు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో అవుతూ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
హోరా హోరీ వ్యూహాలు:ఏపీలో ఎన్నికలు సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. వై నాట్ 175 అంటూ ఏపీలోని అన్ని స్థానాలపైన సీఎం జగన్ గురి పెట్టారు. కుప్పంలోనూ చంద్రబాబును ఎందుకు ఓడించలేమంటూ సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. కుప్పం అభ్యర్ధిగా భరత్ ను ఖరారు చేయటంతో పాటుగా ఎమ్మెల్సీ చేసారు. కుప్పం డోర్ టు డోర్ తిరుగుతున్నారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. మంత్రి పెద్దిరెడ్డి ఈ సారి కుప్పం ఎన్నికను తన వ్యక్తిగత ప్రతిష్ఠగా తీసుకున్నారు. దీంతో, చంద్రబాబు అలర్ట్ అయ్యారు. అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. ప్రతీ మూడు నెలలకోసారి కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు.

కేసీఆర్ తరహా ఆలోచన:ఈ పరిణామాలతో కుప్పంలో ఈ సారి పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా నిర్ణయం అమలు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కుప్పంతో పాటుగా విశాఖ నగర పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి సర్వేలు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. భీమిలి వైపు చూస్తున్నట్లు సమాచారం.
దీని ద్వారా రాయలసీమ నుంచి కుప్పం లో చంద్రబాబు, హిందూపూర్ లో బాలయ్య, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేశ్, గోదావరి జిల్లాల నుంచి పవన్ కల్యాణ్, ఉత్తరాంధ్ర నుంచి కూడా చంద్రబాబు బరిలో నిలవటం ద్వారా మూడు ప్రాంతాల్లోనూ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మూడు ప్రాంతాలపై ప్రభావం:గతంలో ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాన్ సైతం రెండు నియోజవర్గాల నుంచి బరిలో నిలిచారు. ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ తో పాటుగా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో, చంద్రబాబు సైతం రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగే ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ గోదావరి తో పాటుగా విశాఖ నుంచి పోటీ చేస్తే చంద్రబాబు తన ఆలోచన మార్చుకొనే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. దీంతో, విశాఖ పార్లమెంటరీ పరిధిలో చంద్రబాబు, పవన్ ఇద్దరిలో ఒకరు పోటీ ఖాయమని స్పష్టం అవుతోంది. అయితే, కుప్పంతో పాటుగా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే వైసీపీ చేసే ప్రచారానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications