స్మార్ట్పై పుస్తకం, శ్రద్ధగా చదవండి: చంద్రబాబు
హైదరాబాద్: స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుపై ఒక పుస్తకం కూడా రూపొందించామని, ఆ పుస్తకంలో అన్నీ వివరించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దీన్ని ప్రతి ఒక్కరూ చదివి ఇంకా బాగా అభివృద్ధి చేయడం కోసం మెరుగైన సూచనలు ఇవ్వాలని, వాటిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ర్టానికి చేసిన అభివృద్ధి పనులను ఆయన వెల్లడించారు. మంగళవారం ఏపీ సచివాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న రాష్ట్రంలో నిరంత విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ కింద ఫేజ్ 1 అమలు చేశామని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రూ. 2.50 లక్షలకు పెంచి మెరుగైన వైద్యం కోసం ముందుకు వెళుతున్నామని బాబు తెలిపారు.
స్మార్ట్ విటేజ్, స్మార్ట్ వార్డు అనే కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం జనవరి 1న విజయవాడలో ప్రకటించినట్లు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమం ఈనెల 18న అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళతామని, ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ నెల 13న అధికారికంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం అవుతాయని.. మహిళలకు ముగ్గుల పోటీలు, వంటల పోటీలు జరుగుతాయని, రైతులకు పంటలు, పశువుల ప్రదర్శనలు ఉంటాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ నెల 12వ తేదీ లోపల సంక్రాంతి సరుకులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవకు విస్తృత ప్రచారం కల్పించాలని నేతలు, అభిమానులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. పని విషయంలో అధికారులు శ్రద్ధ చూపించాలని చంద్రబాబు అన్నారు.