పోలీసులను పంపిస్తాం: అధికారులపై బాబు ఆగ్రహం
విశాఖపట్నం: హుధుద్ పెను తుఫాను కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము ఏర్పాటు చేసే సమీక్షా సమావేశాలకు హాజరుకాకుంటే, చెప్పిన సమాయానికి రాకుంటే అధికారుల ఇంటికి పోలీసులను పంపిస్తామని చెప్పారు. వారు అరెస్ట్ చేసి తీసుకొస్తారని చెప్పారు.
మంగళవారం నేవీ, ఎయిర్ఫోర్స్, ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్, తక్షణమే సరఫరా చేయాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు అన్ని సర్దుకుంటాయని చెప్పారు. ఆహారం, నీరు విషయంలో నిర్లక్ష్యం వద్దని అధికారులను హెచ్చరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు ఇబ్బంది ఉందని, విజయవాడ, రాజమండ్రి నుంచి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి సమస్య ఉండదని చెప్పారు.
పైరింజన్ల ద్వారా అపార్ట్మెంట్లకు నీరు అందిస్తామని తెలిపారు. నిత్యవాసరాల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశించారు. మూడు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సర్వీసులను సిద్ధం చేసినట్లు తెలిపారు. కష్టకాలంలో విమర్శలు చేయడం తగదని, చేతనైతే సాయం చేయాలని ప్రతిపక్షాలకు చంద్రబాబు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు 25కిలోల బియ్యం, 5లీటర్ల కిరోసిన్, కిలో చక్కెర, 2కిలోల పప్పు, 2కిలోల ఉల్లిగడ్డలు, పామాయిల్, అరకేజి ఉప్పు ప్యాకేజీగా అందిస్తామని చెప్పారు.
చేనేత కార్మికులకు 50కిలోల బియ్యం అందిస్తామని చంద్రబాబు తెలిపారు. రూ. 3కే కూరగాయలను, రూ. 5కే కిలో ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కూడా పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయానికి కల్లా విశాఖ మొత్తం శుభ్రం అయిపోవాలని అధికారులను ఆదేశించారు. చెట్లను, విద్యుత్ స్తంభాల తొలగింపునకు 200 ప్రొక్లెయిన్ ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఇళ్లు, పంటనష్టం, బోట్ల గల్లంతు అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
తుఫాను కారణంగా ఒక్క నేవీలోనే రూ. 2వేల కోట్ల నష్ట జరిగిందని చంద్రబాబు తెలిపారు. ఉక్కు కర్మగారానికి రూ. 340 కోట్లు, విద్యుత్కు రూ. 40 కోట్లు, విశాఖ ఎయిర్పోర్టుకు రూ.500 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు 5,6 జిల్లాల నుంచి కూరగాయాలు తెప్పిస్తున్నామని తెలిపారు. అధికారులు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దని అధికారులను హెచ్చరించారు.
టెలిఫోన్ ఆపరేటర్లు సేవల పునరద్ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సేవల పునరుద్ధరణకు వారు ఏం చేస్తున్నారని చెప్పాలని ప్రశ్నించారు. బీమా సంస్థలను కూడా పిలిచి సాయంత్రం మాట్లాడ్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటారని చెప్పారు. హెరిటేజ్, విశాఖ డెయిరీలను పిలిచి మాట్లాడ్తామని చెప్పారు. ఎక్కువ ధరలకు ఎవరూ నిత్యావసరాలను అమ్మినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తుఫాను బాధితుల కోసం హైదరాబాద్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు మంగళవారం 1.15గంటలకు ప్రధాని విశాఖకు వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
కాగా, ఉత్తరాంధ్రలో రైతు బజార్ల తెరవలేని ఏపి సీఎస్ ఆదేశించారు. శ్రీకాకులం జిల్లాలో నాగావళి ఉధృతంగా ప్రవహిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. నీరు, విద్యుత్, ఆహార పదార్థాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉమామమహేశ్వరరావు తెలిపారు.