సూటిగా చెప్పండి: జైట్లీ రిప్లైపై చంద్రబాబు అసంతృప్తి, కాంగ్రెసుపై ఫైర్
విజయవాడ: ప్రత్యేక హోదాపై జరిగిన చర్చకు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన సమాధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభ సాక్షిగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలనే కేంద్రం ఎందుకు అమలు చేయదని ఆయన అడిగారు.
రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేయడానికి అంతా కలిసి ఒక నాటకం ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. శుక్రవారం రాత్రి ఆయన విజయవాడలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. బిజెపి ప్రత్యేక హోదా హామీని ఇచ్చిందని, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చడానికి సిద్ధంగా లేకపోవడం సరి కాదని ఆయన అన్నారు.
తాను అంతా తమకు అనుకూలంగా చేయాలని అడగడంలేదని, న్యాయం చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు. అప్పుడు అన్నీ ఇస్తామన్నారని, ఇప్పుడేమో నిధులు లేవంటున్నారని ఆయన అన్నారు. కేంద్రం దగ్గర డబ్బులు లేవు, దేశం భరించలేదు అనుకున్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజనకు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు.
ఎన్నో సార్లు ఢిల్లీకెళ్లి సహాయం కోసం విజ్ఞప్తులు చేసుకున్నానని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా న్యాయం చేస్తామని అనడాన్ని ప్రస్తావిస్తూ ఆర్థిక సంఘానికీ, ప్రత్యేక హోదాకూ సంబంధం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకుఇస్తున్నట్లే తమ రాష్ట్రానికీ ఇస్తున్నారని తెలిపారు. టీడీపీ మిత్ర పక్షం అయినంత మాత్రాన ఏపీకి సహాయం చేయలేమని అరుణ్జైట్లీ అనడంపై చంద్రబాబు స్పందిస్తూ తాము పదవులు అడగడం లేదని, కేంద్రం తమకు జరగాల్సిన న్యాయం చేయాలని అడుగుతున్నామని అన్నారు.
ఇలా చేస్తే పార్లమెంట్పై, రాజ్యాంగంపై ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అడిగారు. కొత్త రాష్ట్రానికి ఆనందంతో రాలేదని, అప్పులతో వచ్చామని అన్నారు. కష్టాల్లో ఉండే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తారని ప్రజలు తన మీద నమ్మకం పెట్టుకున్నారని, తాను కేవలం కేంద్రం మీదనే ఆధారపడలేదని, కష్టాన్ని నమ్ముకున్నానని, అందుకే ఇన్ని రోజులలు తాను సహనం వహించానని ఆయన చెప్పారు.
తమ రాష్ట్రానికి సాయం విషయంలో కేంద్రం తీరు బాగాలేదని విమర్శించారు. ఏం చేస్తారో చెప్పాలని, దానికి ప్రజలను సంసిద్ధం చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన సాయంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన పారిశ్రామిక రాయితీలూ పనికిరానివేనని, ఆ రాయితీలు ఎవరూ క్లయిం చేయడం లేదని చంద్రబాబు అన్నారు
న్యాయం చేసే బాధ్యత కేంద్రానికి ఉందా లేదా అని అడిగారు. దాన్ని రాజకీయ కుట్ర అనను గానీ, ఆంధ్రప్రదేశ్కు మాత్రం అన్యాయం చేస్తున్నారని, మిత్రపక్షంగా ఉన్నది సహకారం కోసమేనని స్పష్టం చేశారు. కేంద్రాన్ని తాము బతిమాలడం లేదని, అడుగుతున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విభజన తర్వాత న్యాయం చేస్తామని బీజేపీ ఆనాడు చెప్పిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని బిజెపియే అడిగిందని అన్నారు. విభజన తీరే సరి కాదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు విభజించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
అన్ని పార్టీలూ ప్రత్యేక హోదాకు సానుకూలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. జైట్లీ సమాధానం ముగిసిన వెంటనే ఒక్క నిమిషంలో సభ నుంచ బాయ్కాట్ ఎందుకు చేశారని నిలదీశారు. కాంగ్రెస్, వైసీపీ రాజకీయ లబ్ధికోసం బంద్కు పిలుపునివ్వడం ఎంత దారుణమన్నారు.