దివాళాకోరు వైసిపి అడ్డం పడినా కూడా...: చంద్రబాబు
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ అడ్డం పడినా, దివాళా తీసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డం పడినా రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులను రెచ్చగొట్టి వైసిపి రాజధాని నిర్మాణానికి అడ్డం పడే ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు గ్రామంలో జరిగిన సభలో ఆయన బుధవారంనాడు మాట్లాడారు.
నదుల అనుసంధానం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ నుంచి కరువు శాశ్వతంగా దూరం చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా వ్యవసాయంలోనూ పారిశ్రామిక రంగంలోనూ మొదటి స్థానంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు యాత్ర కొత్త చెరువు నుంచే ప్రారంభమైందని ఆయన చెప్పారు.
తెలుగుగంగ, హంద్రీ నీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను ఎన్టీ రామారావు ప్రారంభించారని, వాటి ద్వారా రాయలసీమకు నీరు అందుతుందని చెప్పారు. పెట్టుబడి రాయితీల, బీమా సౌకర్యాలు కల్పించామని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో రైతులు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు.
వరల్డ్ క్లాస్ సిటీగా అన్ని ఆధునిక హంగులతో రాష్ట్ర రాజధానిని నిర్మించుకుందామని, దీనికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. ఒకప్పుడు రాయలసీమ రత్నాల సీమ అని, ఇప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, రాయలసీమను తప్పకుండా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.