పాతవారు సరే: కాంగ్రెసు మాజీల నుంచే చంద్రబాబు తలనొప్పి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు మాజీల నుంచే సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెసు నుంచి వలస వచ్చిన తెలుగుదేశం పార్టీ తాజా పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు, జెసి దివాకర్ రెడ్డి ఆయనకు కొరకరాని కొయ్యగా తయారైనట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తాజాగా వారిద్దరు చేసిన ప్రకటనలు చంద్రబాబును ఇరకాటంలో పడేశాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తాను, తన సన్నిహితులైన పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా జెసి, రాయపాటి శనివారంనాడు స్పందించారు.
ప్రత్యేక రాదనే విషయం చంద్రబాబుకు కూడా తెలుసునని జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం లేదని రాయపాటి అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీ ప్రభుత్వంపై తాము తెగించి పోరాటం చేయలేమనే నిస్సహాయత కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. టిడిపి పోరాటం చేయలేదనే అర్థం కూడా వచ్చింది. దీంతో చంద్రబాబు ప్రకటనలపై సందేహం కలిగే పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేక హోదా సాధించే వరకు తాము పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పగా, కేంద్రం ప్రకటన కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదని కేంద్ర మంత్రి, టిడిపి నేత సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడి వంటివారు అన్నారు. చంద్రబాబుకు సన్నిహితమైన వీరు చంద్రబాబు వైఖరిని ప్రతిబింబిస్తున్న తరుణంలో జెసి, రాయపాటి ప్రకటనలు టిడిపికి దెబ్బగానే పరిణమించాయి.
నిజానికి, జెసి దివాకర్ రెడ్డి పలు సందర్భాల్లో చంద్రబాబు తీరుపై ప్రకటనలు చేశారు. చంద్రబాబును సమర్థిస్తున్నట్లు కనిపిస్తూనే కుండబద్దలు కొట్టినట్లు ఆయన కాస్తా కటువుగానే వాస్తవాలు చెబుతూ వస్తున్నారు. జెసి దివాకర్ రెడ్డి గానీ రాయపాటి సాంబశివరావు గానీ కాంగ్రెసు సంస్కృతిని అలవరుచుకున్నవారు.
కాంగ్రెసులో ఎప్పుడు ఎవరు మాట్లాడుతారో తెలియనంతగా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెసు తీరే అంత అనేది ప్రజల్లో నాటుకుపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అధినాయకుడు చెప్పిందే మిగతా నాయకులు చెప్పాల్సి ఉంటుంది, అధినాయకుడు చెప్పినట్లే చేయాల్సి ఉంటుంది.
మాటకు, చేతకు పొంతన కుదరని పరిస్తితిలో జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివ రావు తమ పాత అలవాటు ప్రకారం ప్రత్యేక హోదాపై ప్రకటనలు చేశారని భావిస్తున్నారు. వారిని చంద్రబాబు అదుపు చేయగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే.