భయపడ్డారు: బాబుపై జగన్, యువనేత ఫోటో కోసం ఎగబడటంతో..
హైదరాబాద్: తన యాత్రకు భయపడి తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు పరిహారం ఇస్తానని చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సంక్రాంతి తర్వాత రైతు ఓదార్పు యాత్ర చేపడతానని చెప్పారు. తన యాత్రకు భయపడే పరిహారం ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. చంద్రబాబు పదేపదే అబద్దాలు ఆడుతున్నారని, ఆయనది అబద్దం అని చెప్పడానికి కూడా తమకు అవకాశం ఇవ్వడం లేదన్నారు.
సభాపతి టీడీపీ వ్యక్తి అనిపించుకున్నారని విమర్శించారు. సభాపతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం సమస్య కాదని, కానీ అధికార పక్షం వైఖరి మారాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. తన పైన కేసులన్నీ కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే అన్నారు.
ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వని సభాపతి కోడెల శివప్రసాద రావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం గంటల తరబడి ఇచ్చారన్నారు.
జగన్ ఫోటోల కోసం ఎగబడ్డ అసెంబ్లీ సిబ్బంది
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోల కోసం అసెంబ్లీ సిబ్బంది ఎగబడ్డారు. దీంతో జగన్ పది నిమిషాలు బయటే ఉండవలసి వచ్చింది. అసెంబ్లీ 5 రోజుల 22 గంటల 54 నిమిషాలు సాగింది. ఇందులో 3 తీర్మానాలు, 5 బిల్లులకు ఆమోదం లభించింది.
అంతకుముందు సభలో కొల్లేరు ప్రాంత రైతులకు న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం కొల్లేరును 3 కాంటూరుకు కుదించాలన్న తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2006 స్థానికసంస్థల ఎన్నికల సమయంలో కొల్లేరు ప్రాంతంలో భయోత్పాతం సృష్టించారని, భయపడి ఎంతో మంది వలసవెళ్లారన్నారు.
బాంబులు, పొక్లెయినర్లతో చెరువులను ధ్వంసం చేశారని తెలిపారు. అబద్దాలు చెప్పవచ్చు కానీ...చరిత్రను తిరగరాయలేరన్నారు. అప్పుడు తాము నిలదీసిన తర్వాతే భయపడి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. కాంటూరు కుదింపుపై ప్రధాని హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే కొల్లేరుపై నిపుణుల కమిటీ వేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.