భద్రతను కుదించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
అమరావతి: టీడీపీ జాతీయాధ్యక్షుడు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ప్రభుత్వం తనకు భద్రత కుదించిందని తిరిగి పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ పిటిషన్ను మంగళవారం ఉదయం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే చంద్రబాబుకు భద్రత కుదించలేదని ఏపీ ప్రభుత్వం, డీజీపీ గౌతం సవాంగ్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు నిబంధనలకు మించి సెక్యూరిటీ ఇస్తున్నట్లు వారు తెలిపారు. అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోందని ప్రభుత్వం వివరించింది. చంద్రబాబుకు నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. భద్రతను కుదించామంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం సరికాదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అంతకుముందు టీడీపీ వైసీపీ నేతలు డీజీపీ సవాంగ్ను వేర్వేరుగా కలిసి ఫిర్యాదులు చేశారు. చంద్రబాబుకు భద్రత కుదించడం, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు గురించి టీడీపీ ఫిర్యాదు చేసింది. శాంతి భద్రతల విషయంలో సీఎం జగన్ తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని డీజీపీ గుర్తుచేశారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రజలకు పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications