టిఆర్ఎస్ దొంగాట, జగన్ మద్దతు అనైతికం: చంద్రబాబు
అనంతపురం/ హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) దొంగాట ఆడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. తమ శాసనసభ్యులను కొనుగోలు చేసి టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిందని ఆయన అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో బుధవారం ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు తనను విమర్శించే హక్కు లేదని ఆయన అన్నారు. సమైక్యవాదాన్ని వినిపించిన జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం అనైతికమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగు విధానాన్ని మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు దామాషా పద్ధతి ప్రకారం జరగాలని అన్నారు.

వారు రహస్య మిత్రులు
అదలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, జగన్లు రహస్య మిత్రులని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. మూడు స్థానాలు గెలిచే బలమున్న టిఆర్ఎస్ ఐదు స్థానాలు ఎలా గెలిచిందో కెసిఆర్ చెప్పాలన్నారు. రేవంత్ వీడియోలు కొన్ని ఛానెళ్లకే ముందు బహిర్గతమవడంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండు చేశారు.
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి భాద్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఏ సమస్యపైనా జగన్ గవర్నరును కలవలేదని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు.
దొరలు, దొంగలు, ద్రోహుల పాలు
సామాజిక కోణంలో చూసినా, మరే ఇతర కోణాల్లో చూసినా తెలంగాణ రాష్ట్రం దొరలు, దొంగలు, ద్రోహుల పాలు అయ్యిందని ఎమ్మార్పీఎస్ అద్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కేసీఆర్ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలపై నిర్వహించిన మీట్ది ప్రెస్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కెసిఆర్ నమ్మించిన మాటలకు జనం భ్రమల్లో కొట్టుకుపోయారని అన్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసిన వారు ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ప్రత్యేక రాష్ర్టాన్ని అడ్డుకోవాలని చూసిన వారు సంతోషంగా ఉన్నారని విమర్శించారు. ఒక్క ఏడాదిలోనే ఓయూ విద్యార్థుల్లో ఆనందం ఆవిరైందని మందకృష్ణ మాదిగ అన్నారు.












Click it and Unblock the Notifications